ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. పాట్నాలోని పాటలీపుత్ర ఇండోర్ స్టేడియం వేదికగా సోమవారం జరిగిన గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో పాట్నా పైరేట్స్ 32-20 పాయింట్లతో ఘన విజయం సాధించింది. అయితే తొలి అర్ధభాగం ముగిసేసరికి పాట్నా 10-12తో వెనుకంజలో ఉంది. కానీ సొంతగడ్డపై ఆడుతున్న పాట్నా సెకండ్ హాఫ్లో చెలరేగింది.
రెండో అర్ధభాగంలో 22-8 తేడాతో ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించింది. ట్యాకిల్ పాయింట్లతో విరుచుకుపడింది. గుజరాత్ టైటాన్స్ను ఒక్కసారి ఆలౌట్ చేసింది. రైడర్ సందీప్ కుమార్ ఏడు పాయింట్లు, ఆల్రౌండర్ అంకిత్ ఆరు పాయింట్లతో విజయంలో కీలకపాత్ర పోషించారు. గుజరాత్ టైటాన్స్ జట్టులో రైడర్ దహియా ఆరు పాయింట్లతో పోరాడాడు.

అంతకుముందు జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్పై హర్యానా స్టీలర్స్ 41-36 తేడాతో నెగ్గింది. హర్యానా రైడర్లు సిద్ధార్థ్ దేశాయ్ (11), శివమ్ (12) సూపర్-10లతో సత్తాచాటారు. బెంగాల్ జట్టులో మణిందర్ సింగ్ 13 పాయింట్లు, నితీన్ కుమార్ తొమ్మిది పాయింట్లతో పోరాడారు. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి బెంగాల్ వారియర్స్ 18-16 పాయింట్లతో పైచేయి సాధించింది. కానీ సెకండ్ హాఫ్లో అదే జోరును కొనసాగించలేకపోయింది. రెండో అర్ధభాగంలో రెండు సార్లు ఆలౌటైంది.
పాట్నా వేదికగా పుణెరి పల్టాన్తో ఇవాళ తెలుగు టైటాన్స్ తలపడనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. 16 మ్యాచ్లు ఆడిన తెలుగు టైటాన్స్ రెండు మ్యాచ్లు మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అట్టడుగన నిలిచింది. తొలి నాలుగు స్థానాల్లో జైపుర్ పింక్ పాంథర్స్, పుణెరి పల్టాన్, దబాంగ్ ఢిల్లీ, పాట్నా పైరేట్స్ ఉన్నాయి.