ప్రోకబడ్డీ లీగ్ పదో సీజన్ హొరాహొరీగా సాగుతోంది. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్లో యూపీ యోధాస్పై పాట్నా పైరేట్స్ 34-31 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభం నుంచి పాట్నా పైరేట్స్ దూకుడుగా పాయింట్లు సాధించింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి 21- 15తో టాప్లో ఉంది. ఇరు జట్ల రైడర్లు సమాన పాయింట్లు సాధించగా యూపీ కంటే పాట్నా డిఫెండర్స్ మెరుగైన ప్రదర్శన చేశారు.
అయితే సెకండ్ హఫ్లో యూపీ యోధాస్ పుంజుకుంది. గట్టి పోటీనిస్తూ పాయింట్ల వేట కొనసాగించింది. కానీ మూడు పాయింట్ల తేడాతో మ్యాచ్ను చేజార్చుకుంది. పాట్నా పైరేట్స్లో రైడర్లు సచిన్, మంజీత్ చెరో ఆరు పాయింట్లు సాధించారు. ఆల్రౌండర్ అంకిత్ అయిదు పాయింట్లు, డిఫెండర్ బాబు నాలుగు పాయింట్లు నమోదు చేశారు. యూపీ జట్టులో రైడర్ శివమ్ చౌదరీ ఏడు పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచాడు.

అంతకుముందు సొంతగడ్డపై బెంగళూరు బుల్స్తో జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్కు నిరాశే ఎదురైంది. 26-46తో బెంగళూరు చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. తెలుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ షెరావత్ 7 పాయింట్లతో ఒంటరి పోరాటం చేయగా ఇతర ప్లేయర్ల నుంచి అతనికి సరైన సహకారం లభించలేదు.మరోవైపు బెంగళూరు బుల్స్లో అక్షిత్ (9), సుర్జిత్ సింగ్(7), వికాశ్ కందోల(6) సత్తా చాటారు.
అయితే సొంత అభిమానుల మద్దతుతో ఉత్సాహంగా బరిలోకి దిగిన తెలుగు టైటాన్స్ ఫస్టాఫ్లో దుమ్మురేపింది. అదిరిపోయే డిఫెన్స్తో వరుసగా పాయింట్లు సాధించింది. తొలి అర్ధభాగం ముగిసే సరికి తెలుగు టైటాన్స్ 12-9తో ఆధిక్యంలో నిలిచింది. కానీ సెకాండాఫ్లో ఆ జోరును కొనసాగించలేకపోయింది. దూకుడైన ట్యాక్లింగ్, అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. ఏకంగా మూడు సార్లు ఆలౌటైంది.
ఇవాళ హైదరాబాద్ వేదికగా రెండు మ్యాచ్లు జరగనున్నాయి. రాత్రి 8 గంటలకు దబాంగ్ ఢిల్లీతో యు ముంబా, రాత్రి 9 గంటలకు యూపీ యోధాస్తో తెలుగు టైటాన్స్ తలపడనున్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు 13 మ్యాచ్లు ఆడిన తెలుగు టైటాన్స్ ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసి పాయింట్స్ టేబుల్లో అట్టడుగన నిలిచింది.