ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. పాట్నాలోని పాటలీపుత్ర ఇండోర్ స్టేడియం వేదికగా శనివారం జరిగిన పాట్నా పైరేట్స్ - పుణెరి పల్టాన్ మ్యాచ్ 32-32 పాయింట్లతో 'టై'గా ముగిసింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి పుణెరి పల్టాన్ 19-14తో ఆధిక్యంలో నిలిచింది. పాట్నాను ఒక్కసారి ఆలౌట్ చేసి పుణెరి ఫస్ట్ హాఫ్లో దూకుడు ప్రదర్శించింది.
కానీ సొంతగడ్డపై ఆడుతున్న పాట్నా పైరేట్స్ సెకండ్ హాఫ్లో గొప్పగా పుంజుకుంది. ట్యాకిల్ పాయింట్లతో సత్తాచాటుతూ పుణెరిని ఆలౌట్ చేసింది. అయితే గెలిచే అవకాశం ఉన్న మ్యాచ్ను పాట్నా టైగా ముగించింది. ఆఖర్లో వరుసగా రెండు పాయింట్లు కోల్పోయింది. డిఫెండింగ్లో ఆల్రౌండర్ అంకిత్ ఔట్వవగా, చివరి డూ ఆర్ డై రైడ్లో మంజీత్ రాణించలేకపోయాడు.

పుణెరి పల్టాన్ జట్టులో కెప్టెన్ అస్లామ్ ముస్తాఫ 13 పాయింట్లు, ఆల్రౌండర్ మహ్మద్రీజ అయిదు పాయింట్లు సాధించారు. పాట్నా పైరేట్స్ టీమ్లో కెప్టెన్ సచిన్ తొమ్మిది పాయింట్లు, ఢిపెండర్ మయూర్ అయిదు పాయింట్లతో రాణించారు. అదే వేదికగా జరిగిన మరో మ్యాచ్లో యూపీ యోధాస్పై దబాంగ్ ఢిల్లీ 36-27 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఢిల్లీ ఆధిపత్యం చెలాయించింది. ఆల్రౌండ్ షోతో 20-13 పాయింట్లతో ఫస్ట్ హాఫ్ను ఘనంగా ముగించింది. సెకండ్ హాఫ్లోనూ అదే జోరును కొనసాగిస్తూ మ్యాచ్ను సొంతం చేసుకుంది.
దబాంగ్ ఢిల్లీ కెప్టెన్ అషు మాలిక్ 11 పాయింట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. యోగేష్, మీథూ శర్మ చెరో అయిదు పాయింట్లు సాధించారు. యూపీ యోధాస్ జట్టులో రైడర్ గగన గౌడ 12 పాయింట్లు, డిఫెండర్ సుమిత్ ఏడు పాయింట్లతో పోరాడారు. యూపీ కెప్టెన్ ప్రదీప్ నర్వాల్ విఫలమయ్యాడు. ఎనిమిది రైడ్లలో రెండు పాయింట్లు మాత్రమే సాధించాడు. ఇవాళ పాట్నా వేదికగా రాత్రి 8 గంటలకు జైపుర్ పింక్ పాంథర్స్తో బెంగళూరు బుల్స్, రాత్రి 9 గంటలకు తమిళ్ తలైవాస్తో యు ముంబా తలపడనున్నాయి.