డిఫెండింగ్ ఛాంపియన్ జైపుర్ పింక్ పాంథర్స్ పదో సీజన్లోనూ అదే జోరు కొనసాగిస్తోంది. ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన తొలి జట్టుగా జైపుర్ నిలిచింది. తమిళ్ తలైవాస్ను చిత్తుగా ఓడించి ఈ ఘనత అందుకుంది. పాట్నాలోని పాటలీపుత్ర ఇండోర్ స్టేడియం వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్లో తలైవాస్పై 42-27తో పింక్ పాంథర్స్ ఘన విజయం సాధించింది.
ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి 15-17తో జైపుర్ రెండు పాయింట్ల వెనుకంజలో ఉంది. ఇరు జట్లు ఒక్కసారి కూడా ఆలౌట్ కానప్పటికీ తమిళ్ తలైవాస్ డిఫెండర్లు సత్తాచాటారు. కానీ సెకండ్ హాఫ్లో జైపుర్ పింక్ పాంథర్స్ చెలరేగారు. రైడింగ్, ట్యాకిల్ పాయింట్లతో వరుసగా హోరెత్తించారు. రెండో అర్ధభాగంలో తలైవాస్ కనీస పోటీ కూడా ఇవ్వలేదు.

జైపుర్ తరఫున రైడర్లు అర్జున్ దేశ్వాల్ (13 పాయింట్లు), అజిత్ (9) సత్తాచాటారు. తమిళ్ తలైవాస్ తరఫున రైడర్ నరేందర్ (12) పోరాడాడు. అంతకుముందు జరిగిన పాట్నా పైరేట్స్-బెంగళూరు బుల్స్ మ్యాచ్ 29-29తో టైగా ముగిసింది. తొలి అర్ధభాగంలో బెంగళూరు బుల్స్ ఆధిపత్యం చెలాయించింది. 16-13తో పైచేయి సాధించింది. కానీ అదే జోరును బెంగళూరు కొనసాగించలేకపోయింది.
రెండో అర్ధభాగంలో పాట్నా పైరేట్స్ విజృంభించి గెలిచేలా కనిపించింది. కానీ మ్యాచ్ ఆఖర్లో బెంగళూరు రైడర్ భరత్ పాయింట్ సాధించి మ్యాచ్ను టైగా ముగించాడు. పాట్నా పైరేట్స్ జట్టులో సందీప్ కుమార్ 14 పాయింట్లతో సత్తాచాటాడు. బెంగళూరు బుల్స్లో రైడర్ సుశీల్ (8) టాప్ స్కోరర్. కాగా, పాయింట్ల పట్టికలో జైపుర్ పింక్ పాంథర్స్ (71 పాయింట్లు), పుణెరి పల్టాన్ (68), దబాంగ్ ఢిల్లీ (59), పాట్నా పైరేట్స్ (53) టాప్-4లో ఉన్నాయి. ఇవాళ పాట్నా వేదికగా రెండు మ్యాచ్లు జరగనున్నాయి. రాత్రి 8 గంటలకు దబాంగ్ ఢిల్లీతో బెంగాల్ వారియర్స్, రాత్రి 9 గంటలకు గుజరాత్ జెయింట్సతో హర్యానా స్టీలర్స్ తలపడనున్నాయి.