ప్రో కబడ్డీ పదో సీజన్లో ఆసక్తికరంగా సాగుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న జైపుర్ పింక్ పాంథర్స్ మరో హోరాహొరీ మ్యాచ్లో నెగ్గింది. సోమవారం జైపుర్ వేదికగా యు ముంబాతో జరిగిన మ్యాచ్లో పింక్ పాంథర్స్ 31-29 తేడాతో విజయం సాధించింది. తొలి అర్ధభాగంలో ఒక్క పాయింట్తో వెనుకంజలో నిలిచిన జైపుర్ తర్వాత విజృంభించింది.
ఫస్ట్ హాఫ్లో యు ముంబా సత్తాచాటింది. జైపుర్ జట్టుపై ఒత్తిడి తీసుకుని వస్తూ 14-13తో నిలిచింది. అయితే సెకండ్ హాఫ్లో పింక్ పాంథర్స్ ఆల్రౌండ్ షో తో అదరగొట్టింది. రైడింగ్, డిఫెండింగ్లో ప్రత్యర్థిని వణికించింది. కీలక పాయింట్లు సాధిస్తూ అంతిమంగా విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు ఒక్కసారి కూడా ఆలౌట్ కాలేదు.

కాగా, ఈ విజయంతో జైపుర్ పింక్ పాంథర్స్ పాయింట్ల టేబుల్లో టాప్లో నిలిచింది. ఆ జట్టులో రైడర్ అర్జున్ దేశ్వాల్ (11) సూపర్-10 సాధించాడు. మరో రైడర్ అజిత్ ఏడు పాయింట్లు, డిఫెండర్ సాహుల్ నాలుగు పాయింట్లతో రాణించారు. యు ముంబా జట్టులో రైడర్ గుమన్ సింగ్ పది పాయింట్లతో పోరాడాడు.
జైపుర్ వేదికగా జరిగిన మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్పై బెంగాల్ వారియర్స్ 35-29 తేడాతో విజయం సాధించింది. ఆది నుంచే బెంగాల్ దూకుడుగా ఆడుతూ పాయింట్లు సాధించింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి 19-12తో ఫేవరేట్గా నిలిచింది. అయితే బెంగళూరు మ్యాచ్ను అంత తేలికగా వదల్లేదు. సెకండ్ హాఫ్లో గట్టిపోటీ ఇచ్చింది. కానీ ఆ పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగింది.
బెంగాల్ విజయంలో కెప్టెన్, రైడర్ మణిందర్ సింగ్ తొమ్మిది పాయింట్లతో కీలక పాత్ర పోషించాడు. డిఫెండర్ శుభమ్ ఏడు పాయింట్లతో సత్తాచాటాడు. బెంగళూరు బుల్స్లో భరత్ సూపర్-10 సాధించాడు. పాయింట్ల పట్టికలో జైపుర్ పింక్ పాంథర్స్, పుణెరి పల్టాన్, దబాంగ్ దిల్లీ, గుజరాత్ జెయింట్స్ టాప్-4లో నిలిచాయి. కాగా, ఇవాళ రాత్రి 8 గంటలకు పాట్నా పైరేట్స్తో తమిళ్ తలైవాస్ తలపడనుంది.