ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్ హోరాహోరీగా సాగుతోంది. ఢిల్లీ వేదికగా త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో బుధవారం దబాంగ్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో జైపుర్ పింక్ పాంథర్స్ విజయం సాధించింది. 22-27 పాయింట్లతో ఢిల్లీని చిత్తుచేసింది. ఇప్పటికే ప్లేఆఫ్స్కు చేరిన జైపుర్ ఈ గెలుపుతో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. మరోవైపు జైపుర్పై నెగ్గి ప్లేఆఫ్స్కు చేరిన మూడో జట్టుగా నిలవాలనుకున్న దబాంగ్ ఢిల్లీకి నిరాశే మిగిలింది. సెమీస్ మ్యాచ్లకు అర్హత సాధించడానికి ఢిల్లీ మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జైపుర్ పింక్ పాంథర్స్ (77 పాయింట్లు), పుణెరి పల్టాన్ (76) ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. దబాంగ్ ఢిల్లీ 69 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. కాగా, మ్యాచ్ ఆరంభం నుంచి జైపుర్ దూకుడుగా పాయింట్లు సాధించింది. ఢిల్లీని ఒక్కసారి ఆలౌట్ చేసి ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి 9-16తో భారీ ఆధిక్యంలో నిలిచింది.

కానీ సెకండ్ హాఫ్లో సొంతగడ్డపై ఆడుతున్న దబాంగ్ ఢిల్లీ తీవ్ర పోటీనిచ్చింది. జైపుర్ను ఆలౌట్ చేయనప్పటికీ రెండో అర్ధభాగంలో 13-11తో పైచేయి సాధించింది. అయితే ఈ పోరాటం విజాయనికి సరిపోలేదు. ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగింది. జైపుర్ జట్టులో రైడర్ అర్జున్ దేశ్వాల్ సూపర్-10 సాధించాడు. ఢిల్లీ కెప్టెన్, రైడర్ అషు మాలిక్ 9 పాయింట్లతో పోరాడాడు.
అంతకుముందు ఢిల్లీ వేదికగా జరిగిన మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్పై పుణెరి పల్టాన్ 31-40 తేడాతో నెగ్గింది. ఇప్పటికే ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన పుణెరి స్వేచ్ఛగా ఆడుతూ పాయింట్లు కొల్లగొట్టింది. ఫస్ట్ హాఫ్లో 13-18తో ముందంజలో నిలిచింది. సెకండ్ హాఫ్లోనూ అదే జోరు కొనసాగిస్తూ మ్యాచ్ను ఘనంగా ముగించింది. పుణెరి పల్టాన్ కెప్టెన్ అస్లామ్ ముస్తాఫ 11 పాయింట్లు, రైడర్ ఆకాశ్ 8 పాయింట్లతో సత్తాచాటారు. బెంగళూరు బుల్స్ జట్టులో రైడర్ సుశీల్ (9) టాప్ స్కోరర్.
నేటి నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు లీగ్ మ్యాచ్లు కోల్కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరగనున్నాయి. ఇవాళ రాత్రి 8 గంటలకు బెంగళూరు వారియర్స్తో గుజరాత్ జెయింట్స్, రాత్రి 9 గంటలకు హర్యానా స్టీలర్స్తో యూపీ యోధాస్ తలపడున్నాయి.