ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్ హోరాహోరీగా సాగుతోంది. ఢిల్లీ వేదికగా త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం గుజరాత్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ 34-30 తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి హర్యానా గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. 11 పాయింట్ల వెనుకంజలో స్టీలర్స్ 10-21తో నిలిచింది. రైడింగ్, ట్యాకిల్లో విఫలమై ఒక్కసారి ఆలౌట్ కూడా అయ్యింది.
కానీ రెండో అర్ధభాగంలో హర్యానా స్టీలర్స్ విజృంభించింది. గుజరాత్ జెయింట్స్కు అవకాశమే ఇవ్వలేదు. రెండు సార్లు గుజరాత్ను ఆలౌట్ చేసింది. సెకండ్ హాఫ్లో ప్రత్యర్థి జట్టు 9 పాయింట్లే సాధిస్తే హర్యానా 24 పాయింట్లు తమ ఖాతాలో వేసుకోవడం విశేషం. హర్యానా జట్టులో రైడర్ వినయ్ తొమ్మిది పాయింట్లు, డిఫెండర్లు మోహిత్, నందాల్ చెరో నాలుగు పాయింట్లు సాధించారు.గుజరాత్ జట్టులో కెప్టెన్, డిఫెండర్ ఫజెల్, రైడర్ దహియా తలో ఏడు పాయింట్లతో పోరాడారు.

అంతకుముందు జరిగిన మ్యాచ్లో దబాంగ్ ఢిల్లీపై బెంగాల్ వారియర్స్ 38-45తో నెగ్గింది. తొలి అర్ధభాగంలో ఢిల్లీ పైచేయి సాధించింది. రెండు సార్లు బెంగాల్ను ఆలౌట్ చేసి 21-15 పాయింట్లతో ఆధిపత్యం చెలాయించింది. కానీ సెకండ్ హాఫ్లో సీన్ రివర్స్ అయ్యింది. ఢిల్లీని బెంగాల్ ఏకంగా మూడు సార్లు ఆలౌట్ చేసి తిరిగి పోటీలోకి వచ్చింది. వరుస పాయింట్లతో సత్తాచాటి మ్యాచ్ను సొంతం చేసుకుంది.
బెంగాల్ వారియర్స్ జట్టులో కెప్టెన్ మణిందర్ సింగ్ (11 పాయింట్లు), రైట్ రైడర్ నితీన్ కుమార్ (13) సూపర్-10 సాధించారు. దబాంగ్ ఢిల్లీ జట్టులో కెప్టెన్, రైడర్ అషు మాలిక్ 17 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. కాగా, ఈ సీజన్లో జైపుర్ పింక్ పాంథర్స్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. పుణెరి పల్టాన్, దబాంగ్ ఢిల్లీ, హర్యానా స్టీలర్స్ పాయింట్ల పట్టికలో రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఇవాళ ఢిల్లీ వేదికగా రాత్రి 8 గంటలకు యూపీ యోధాస్తో యు ముంబా, రాత్రి 9 గంటలకు దబాంగ్ ఢిల్లీతో తెలుగు టైటాన్స్ తలపడనున్నాయి.