ప్రోకబడ్డీ లీగ్ పదో సీజన్ ప్రీ క్లైమాక్స్కు చేరింది. సెమీస్లో తలపడే జట్లు ఖరారయ్యాయి. ఎలిమినేటర్ మ్యాచ్ల్లో హర్యానా స్టీలర్స్, పట్నా పైరేట్స్ విజయ సాధించి సెమీఫైనల్స్కు చేరాయి. హైదరాబాద్ వేదికగా సోమవారం జరిగిన ఎలిమినేటర్-1లొ గుజరాత్ జెయింట్స్పై హర్యానా స్టీలర్స్ 42-25 తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్ ప్రారంభం నుంచే హర్యానా ఆధిపత్యం చెలాయించింది. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి 16-21 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్లు చెరోసారి ఆలౌట్ అయ్యాయి. రెండో అర్ధభాగంలో హర్యానా చెలరేగింది. గుజరాత్ను రెండు సార్లు ఆలౌట్ చేసింది. వరుస పాయింట్లతో హోరెత్తించింది.

హర్యానా స్టీలర్స్ జట్టులో రైడర్లు వినయ్ 12 పాయింట్లు, శివమ్ 8 పాయింట్లతో సత్తాచాటారు. డిఫెండర్ మోహిత్ ఏడు పాయింట్లు సాధించాడు. గుజరాత్ జట్టులో పరతీక్, రాకేశ్ అయిదు పాయింట్లతో పోరాడాడు.
అంతకుముందు జరిగిన ఎలిమినేటర్-1 మ్యాచ్ హోరాహోరీగా సాగింది. దబాంగ్ ఢిల్లీ, పట్నా పైరేట్స్ నువ్వానేనా అన్నట్లుగా పోరాడాయి. అంతిమంగా 35-37 పాయింట్ల తేడాతో పట్నా పైరేట్స్ విజయం సాధించింది. మ్యాచ్ ఆద్యంతం ఇరు జట్ల మధ్య పోటీ ఆసక్తికరంగా సాగింది. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి దబాండ్ ఢిల్లీ 20-19 స్కోరు ఒక్క పాయింట్ ఆధిక్యంలో నిలిచింది.

కానీ సెకండ్ హాఫ్లో ఢిల్లీ అదే జోరు కొనసాగించలేకపోయింది. పట్నా పుంజుకుని పైచేయి సాధించింది. ఢిల్లీని ఒక్కసారి ఆలౌట్ చేసి విజయతీరాలకు చేరింది. పట్నా విజయంలో కెప్టెన్, రైడర్ సచిన్ తొమ్మిది పాయింట్లతో కీలకపాత్ర పోషించాడు. మరోవైపు ఢిల్లీ జట్టులో సారథి అషు మాలిక్ మినహా ఎవరూ సత్తాచాటలేకపోయారు. అషు 19 పాయింట్లతో పోరాడాడు.
కాగా, హైదరాబాద్ వేదికగా బుధవారం సెమీఫైనల్స్ జరగనున్నాయి. రాత్రి 8 గంటలకు ప్రారంభంకానున్న సెమీఫైనల్-1లో పట్నా పైరేట్స్తో పుణెరి పల్టాన్ తలపడనుంది. రాత్రి 9 గంటలకు మొదలుకానున్న సెమీఫైనల్-2లో హర్యానా స్టీలర్స్తో జైపుర్ పింక్ పాంథర్స్ పోటీపడనుంది.