ప్రోకబడ్డీ లీగ్ పదో సీజన్లో ప్లేఆఫ్స్కు చేరిన జట్లు తేలిపోయాయి. ఇక తదుపరి దశకు అర్హత సాధించిన జట్లు మిగిలిన మ్యాచ్ల్లో గెలిచి టాప్-6లో తమ ర్యాంకుల మెరుగుపర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. మిగిలిన జట్లు ఓదార్పు విజయాలు కోసం ట్రై చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంచకుల వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో యూపీ యోధాస్పై గుజరాత్ జెయింట్స్ 36-29 తేడాతో నెగ్గింది. ఈ గెలుపుతో గుజరాత్ నాలుగో స్థానంలో, మరోవైపు యూపీ యోధాస్ 11వ స్థానంలో నిలిచాయి.
తొలి అర్ధభాగంలో గుజరాత్కు యూపీ యోధాస్ గట్టిపోటీనిచ్చింది. 13-15 పాయింట్లతో రెండు పాయింట్లే వెనుకంజలో ఉండి మ్యాచ్ను ఆసక్తికరంగా మార్చింది. ఫస్ట్ హాఫ్ ఇరు జట్లు ఆలౌట్ కాలేదు. కానీ సెకండ్ హాఫ్లో గుజరాత్ జెయింట్స్ ముందు యూపీ యోధాస్ నిలబడలేకపోయింది. రెండు సార్లు ఆలౌటైంది. యూపీ జట్టులో రైడర్ గగన గౌడ తొమ్మిది పాయింట్లు, డిఫెండర్ హితేశ్ ఏడు పాయింట్లతో సత్తాచాటారు. గుజరాత్ జట్టులో పర్తీక్ దహియా 12 పాయింట్లతో పోరాడాడు.

అంతకుముందు అదే వేదికగా జరిగిన మ్యాచ్లో యు ముంబాపై హర్యానా స్టీలర్స్ 46-40 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభం నుంచి హర్యానా దూకుడుగా పాయింట్లు సాధించింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి 30-15 పాయింట్లతో భారీ ఆధిక్యంలో నిలిచింది. సెకండ్ హాఫ్లో యు ముంబా పుంజుకుంది. 25-16తో సత్తాచాటింది. కానీ ఫస్ట్ హాఫ్లోని భారీ లోటుతో విజయతీరాలకు చేరలేకపోయింది. హర్యానా జట్టులో విశాల్ 15 పాయింట్లతో మెరిశాడు. యూ ముంబాలో గుమన్ సింగ్ (8 పాయింట్స్) టాప్ స్కోరర్.
ఇవాళ పంచకుల వేదికగా రెండు మ్యాచ్లు జరగనున్నాయి. తమిళ్ తలైవాస్ జట్టుతో బెంగాల్ వారియర్స్ రాత్రి 8 గంటలకు, దబాంగ్ ఢిల్లీ కేసీతో బెంగళూరు బుల్స్ రాత్రి 9 గంటలకు తలపడనున్నాయి. కాగా, జైపుర్ పింక్ పాంథర్స్, పుణెరి పల్టాన్, గుజరాత్ జెయింట్స్, దబాంగ్ ఢిల్లీ, హర్యానా స్టీలర్స్, పట్నా పైరేట్స్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఇక తెలుగు టైటాన్స్ విషయానికొస్తే.. ఈ సీజన్లో 21 మ్యాచ్లు ఆడిన టైటాన్స్ కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. 19 మ్యాచ్ల్లో ఓడి పాయింట్ల టేబుల్లో అట్టడుగున నిలిచింది.