ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్లో లీగ్ మ్యాచ్లు ముగిశాయి. బుధవారం జరిగిన రెండు మ్యాచ్లతో పాయింట్ల పట్టికలో స్థానాలు ఖరారయ్యాయి. యూపీ యోధాస్తో జరిగిన మ్యాచ్లో పుణెరి పల్టాన్ 40-38తో విజయం సాధించి టేబుల్ టాపర్గా నిలిచింది. అయితే ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి పుణెరి గెలుస్తుందని ఎవరికీ అంచనాలు లేవు. 28-15తో యూపీ యోధాస్ ఆధిక్యంలో నిలిచింది.
కానీ సెకండ్ హాఫ్లో పుణెరి చెలరేగింది. రైడింగ్, ట్యాకిల్లో సత్తాచాటి ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్ చేసింది. పుణెరి జట్టులో పంకజ్ మొహితె 12 పాయింట్లు, కెప్టెన్, ఆల్రౌండర్ మహ్మద్రీజా అయిదు పాయింట్లతో సత్తాచాటారు. యూపీ యోధాస్ జట్టులో గగన గౌడ 16 పాయింట్లతో పోరాడారు.

మరో మ్యాచ్లో హర్యానా స్టీలర్స్పై బెంగళూరు బుల్స్ 39-53 పాయింట్లతో ఘన విజయం సాధించింది. తొలి అర్ధభాగం హొరాహొరీగా సాగింది. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి ఇరు జట్లు 24-24 పాయింట్లతో సమంగా నిలిచాయి. కానీ సెకండ్ హాఫ్లో హర్యానాను బెంగళూరు ఛాన్స్ ఇవ్వలేదు. రెండు సార్లు ఆలౌట్ చేసి పాయింట్లు కొల్లగొట్టింది. బెంగళూరు రైడర్ సుశీల్ 22 పాయింట్లతో చెలరేగాడు. కాగా, లీగ్ మ్యాచ్లు ముగియడంతో ఎలిమినేటర్, సెమీ ఫైనల్స్ మ్యాచ్ల్లో తలపడే జట్లు ఖరారయ్యాయి.
పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు పుణెరి పల్టాన్, జైపుర్ పింక్ పాంథర్స్ నేరుగా సెమీఫైనల్కు అర్హత సాధించాయి. ఎలిమినేటర్-1లో తలపడే దబాంగ్ ఢిల్లీ- పాట్నా పైరేట్స్ మ్యాచ్ విజేతతో సెమీస్లో పుణెరి పోటీపడుతుంది. అలాగే ఎలిమినేటర్-2లో గుజరాత్ జెయింట్స్ - హర్యానా స్టీలర్స్ మ్యాచ్ విజేతతో మరో సెమీస్లో జైపుర్ తలపడుతుంది. మూడు నుంచి ఆరో స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్స్ అర్హత సాధిస్తాయి. కాగా, ఫిబ్రవరి 26న ఎలిమినేటర్స్ మ్యాచ్లు,ఫిబ్రవరి 28న సెమీఫైనల్స్, మార్చి 1న ఫైనల్ జరుగుతాయి.