ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్ హోరాహోరీగా సాగుతోంది. ఢిల్లీ వేదికగా త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో సోమవారం జరిగిన దబాండ్ ఢిల్లీ - పుణెరి పల్టాన్ మ్యాచ్ 'టై'గా ముగిసింది. ఆఖరి ఉత్కంఠగా సాగిన ఈ పోరు 30-30 పాయింట్లతో సమానంగా నిలిచాయి. అయితే ఈ మ్యాచ్ ఫలితంతో పుణెరి పల్టాన్కు ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది.
ఈ సీజన్లో ప్లేఆఫ్స్కు చేరిన రెండో జట్టు పుణెరి పల్టాన్. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న జైపుర్ పింక్ పాంథర్స్ ఇటీవల ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే దబాండ్ ఢిల్లీ, పుణెరి పల్టాన్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి సొంతగడ్డపై ఆడుతున్న ఢిల్లీ ఆధిపత్యం చెలాయించింది. 18-10 పాయింట్లతో తొలి అర్ధభాగంలో పైచేయి సాధించింది.

కానీ సెకండ్ హాఫ్లో పుణెరి పల్టాన్ గొప్పగా పుంజుకుంది. వరుస పాయింట్లతో హోరెత్తించింది. ఢిల్లీని ఒకసారి ఆలౌట్ చేసి తిరిగిపోటీలోకి వచ్చింది. ఆఖర్లో ఆల్రౌండర్ అస్లామ్ పుణెరి ప్లేయర్ విక్రాంత్ను ఔట్ చేసి స్కోరును సమం చేశాడు. పుణెరి జట్టులో అస్లామ్ పది పాయింట్లతో సత్తాచాటాడు. దబాండ్ ఢిల్లీ టీమ్లో కెప్టెన్ అషు మాలిక్ (8 పాయింట్లు) టాప్ స్కోరర్.
అంతకుముందు జరిగిన మ్యాచ్లో జైపుర్ పింక్ పాంథర్స్కు పాట్నా పైరేట్స్ షాక్ ఇచ్చింది. 36-33 పాయింట్లతో పైరేట్స్ విజయం సాధించింది. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి జైపుర్ 18-14 పాయింట్లతో పైచేయి సాధించింది. కానీ సెకండ్ హాఫ్లో పాట్నా అదరగొట్టింది. జైపుర్ను ఏకంగా రెండు సార్లు ఆలౌట్ చేసి పాయింట్లు కొల్లగొట్టింది. కాగా, ఇవాళ ఢిల్లీ వేదికగా తమిళ్ తలైవాస్తో యూపీ యోధాస్ తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.
పాయింట్ల పట్టికలో జైపుర్ పింక్ పాంథర్స్, పుణెరి పల్టాన్, దబాంగ్ ఢిల్లీ, పాట్నా పైరేట్స్ తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ప్లేఆఫ్స్ రేసులో ఢిల్లీ ఫేవరేట్గా ఉంది. కాగా, పాట్నా పైరేట్స్, గుజరాత్ జెయింట్స్, హర్యానా స్టీలర్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొననుంది.