ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్ హొరాహొరీగా సాగుతోంది. ముంబయిలోని ఎన్ఎస్సీఐ మైదానం వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్లో యూ ముంబాపై దబాంగ్ ఢిల్లీ 34-40 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్లో దబాంగ్ ఢిల్లీ రెండో స్థానానికి ఎగబాకింది. అగ్రస్థానంలో పుణెరి పల్టాన్ ఉంది.
ముంబా -ఢీల్లీ పోరులో తొలి అర్ధభాగం హొరాహొరీగా సాగింది. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి ఢిల్లీ దబాంగ్ 20-18 పాయింట్లతో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. అయితే ముంబా రైడర్లు తొలి అర్ధభాగంలో అదరగొట్టారు. 15 పాయింట్లు సాధించారు. కానీ సెకండ్ హాఫ్లో ముంబా గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. మరోవైపు దబాంగ్ ఢిల్లీ సత్తాచాటింది. ఆల్రౌండ్ షోతో ప్రత్యర్థిపై చేయి సాధించింది.

దబాంగ్ ఢిల్లీ కెప్టెన్, రైడర్ అశు మాలిక్ 13 పాయింట్లతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరో రైడర్ మంజీత్ ఆరు పాయింట్లు, డిఫెండర్ యోగేష్ నాలుగు పాయింట్లతో సత్తాచాటారు. యు ముంబా జట్టులో ఆల్రౌండర్ 11 పాయింట్లు, రైడర్ గుమన్ సింగ్ తొమ్మిది పాయింట్లతో పోరాడారు.
ముంబయి వేదికగా అంతకుముందు జరిగిన మరో మ్యాచ్లో పాట్నా పైరేట్స్పై బెంగళూరు బుల్స్ 35-33 తేడాతో నెగ్గింది. అయితే తొలి అర్ధభాగంలో బెంగళూరు 12-20తో వెనుకంజలో నిలిచింది.రైడింగ్, ట్యాక్లింగ్లో సమష్టిగా విఫలమై ఒకసారి ఆలౌటైంది. కానీ సెకండ్ హాఫ్లో బెంగళూరు బుల్స్ అదరగొట్టింది. రైడర్స్, డిఫెండర్స్ చెలరేగి పాయింట్ల వేటలో దూసుకెళ్లారు. సెకండాఫ్లో మొత్తం 23 పాయింట్స్ సాధించి విజయాన్ని అందుకుంది.
బెంగళూరు ఆల్రౌండర్ సచిన్ నర్వాల్ 9 పాయింట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. డిఫెండర్ సుర్జీత్ సింగ్ 8 పాయింట్స్తో రాణించాడు. పాట్నా పైరేట్స్లో సచిన్ ఆరు, నీరజ్ కుమార్ అయిదు, మంజీత్ ఏడు పాయింట్లతో పోరాడారు.కాగా, ఇవాళ ముంబయి వేదికగా బెంగాల్ వారియర్స్తో తెలుగు టైటాన్స్ తలపడనుంది. ఇప్పటివరకు పది మ్యాచ్లు ఆడిన టైటాన్స్ ఒక్క విజయాన్ని మాత్రమే సాధించింది.