ద్వితీయార్ధంలో తమిళ జట్టు కొంచెం పోటీ
బెంగళూరు బుల్స్ 44-35తో తమిళ్ తలైవాస్ను ఓడించింది. పవన్ సెహ్రావత్ 16, కాశీలింగ్ 12 పాయింట్లతో బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రథమార్ధం ముగిసేసరికి 25-14 ఆధిక్యంలో నిలిచిన బెంగళూరుకు.. ద్వితీయార్ధంలో తమిళ జట్టు కొంచెం పోటీ ఇచ్చింది.
తలైవాస్ గెలిచింది ఇప్పటిదాకా ఒకే మ్యాచ్
కానీ ప్రత్యర్థి ఆధిక్యాన్ని మాత్రం తగ్గించలేకపోయింది. ఆ జట్టు కెప్టెన్ అజయ్ ఠాకూర్ మరోసారి ఒంటరి పోరాటం చేశాడు. అతను 9 పాయింట్లు సాధించాడు. అజయ్కి సహచరుల నుంచి మద్దతు లేకపోవడంతో తలైవాస్కు మరో ఓటమి తప్పలేదు. ఈ సీజన్లో తలైవాస్ ఇప్పటిదాకా ఒకే మ్యాచ్ గెలిచింది. వరుసగా ఐదు మ్యాచ్ల్లోనూ పరాజయం చవిచూసింది.
చివరి నిమిషాల్లో ముంబా దూకుడుగా
మరో పక్క లీగ్ ఆరో సీజన్ ఆరంభం నుంచి యు ముంబా జోరు కొనసాగిస్తోంది. ఆ జట్టు నాలుగు మ్యాచ్ల్లో మూడో విజయం నమోదు చేసింది. బుధవారం ఆ జట్టు 42-32తో హరియాణా స్టీలర్స్ను దాని సొంతగడ్డపై ఓడించింది. ముంబా జట్టులో సిద్దార్థ్ దేశాయ్ అద్భుత ప్రదర్శన చేస్తూ 15 రైడ్ పాయింట్లు కొల్లగొట్టాడు. అతను కేవలం నాలుగు మ్యాచ్ల్లో 50 పాయింట్లు సాధించడం విశేషం. ప్రొ కబడ్డీ చరిత్రలోనే అత్యంత వేగంగా 50 పాయింట్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ప్రత్యర్థి జట్టులో మోను గోయత్ కూడా 15 పాయింట్లతో మెరిసినా.. సహచరుల నుంచి అతడికి సరైన సహకారం అందలేదు.
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో
సిద్దార్థ్ మెరుపులతో ముంబా ప్రథమార్ధం అయ్యేసరికే 24-13తో ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత కూడా ఆ ఆధిక్యాన్ని కొనసాగించింది. ఇంకో నాలుగు నిమిషాలే మిగిలుండగా.. 27-33తో ప్రత్యర్థికి హరియాణా చేరువగా వచ్చినా.. చివరి నిమిషాల్లో ముంబా ఆటగాళ్లు దూకుడుగా ఆడి మ్యాచ్ను సొంతం చేసుకున్నారు. మూడు విజయాలు, ఒక టైతో మొత్తం 18 పాయింట్లు సాధించిన ముంబా.. జోన్-ఎ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.