హైదరాబాద్: ప్రపంచమంతా ఫుట్బాల్ వైపు చూస్తుంటే భారత్లో మాత్రం క్రికెట్కు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. అంతటి క్రేజ్ సంపాదించుకున్న క్రికెట్ తర్వాత భారత్లో మళ్లీ అంతటి క్రేజ్ ఉంది కేవలం ప్రొ కబడ్డీ లీగే (పీకేఎల్)కి మాత్రమే. ఇప్పుడు అదే లీగ్ మళ్లీ కూతపెట్టి ఆరోసీజన్కు సిద్దమైంది. ఈ సందర్భంగా తాజా సీజన్ కోసం బుధవారం నిర్వహించిన వేలంలో ఇరానీ ఆటగాడు ఫజెల్ అట్రాచలి కోటి రూపాయలు పలికి రికార్డు సృష్టించాడు.
పీకేఎల్ చరిత్రలో అధిక ధర పలికిన ఆటగాడిగా:
దీంతో ఫజెల్ పీకేఎల్ వేలంలో అధిక ధర పలికిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. యు ముంబా జట్టు ఫజెల్ను కోటికి కొనుగోలు చేసింది. తొలి రోజు వేలం ముగిసేసరికి ఫజెల్ అట్రాచలి రూ. కోటి ధర పలకడంతో పాటు మిగిలిన ఐదుగురు ఆటగాళ్లను అంటి పెట్టుకున్న జట్లు కోట్లలోనే చెల్లిస్తున్నాయి.
గత సీజన్లో 93 లక్షలతో భారత ఆటగాడు నితిన్ తోమర్ రికార్డు నమోదు చేశాడు. పీకేఎల్ లీగ్లో ఫజెల్ బెస్ట్ డిఫెండర్గా గుర్తింపుపొందాడు. అతని టాకిల్ పాయింట్స్ 152. ఇక 11 సార్లు హైఫైవ్స్( ఒక మ్యాచ్లో 5 పాయింట్లు) సాధించాడు.
12 ఫ్రాంచైజీల్లో 9 ఫ్రాంచైజీలు ఇప్పటికే 21 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. ఒక ఫ్రాంచైజీ గరిష్టంగా ముగ్గురిని రిటెయిన్ చేసుకోవచ్చు. వేలం గురువారం కూడా కొనసాగనుంది. ఈ సీజన్ వేలంలో మొత్తం 422 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండగా... ఇందులో 14 దేశాలకు చెందిన 58 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. వీరంతా ఇరాన్, బంగ్లాదేశ్, జపాన్, కెన్యా, కొరియా, మలేసియా, శ్రీలంక తదితర దేశాల ఆటగాళ్లు.
ఈసారి కొత్తగా ఫ్యూచర్ కబడ్డీ హీరోస్ (ఎఫ్కేహెచ్) వేలంలోకి వచ్చారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రతిభాన్వేషణ పోటీల ద్వారా వీరంతా పీకేఎల్ వేలానికి అర్హత సంపాదించారు. పీకేఎల్లో ఒక్కో ఫ్రాంచైజీ ఆటగాళ్ల కొనుగోలు కోసం గరిష్టంగా రూ. 4 కోట్లు ఖర్చు చేయొచ్చు. జట్టులో కనిష్టంగా 18 మంది, గరిష్టంగా 25 మందికి మించకుండా ఆటగాళ్లను కొనాల్సి ఉంటుంది.