ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. కోల్కతాలో నేతాజీ ఇండోర్ స్టేడియం వేదికగా పట్నా పైరేట్స్తో జరిగిన హోరాహోరీ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 36-38 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 20 మ్యాచ్లు ఆడిన టైటాన్స్ కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. 17 పాయింట్లతో టేబుల్ అట్టడుగున 12వ స్థానంలో నిలిచింది.
ఈ సీజన్లో తెలుగు టైటాన్స్ మరో రెండు మ్యాచ్లు ఆడనుంది. ఆ రెండింట్లో గెలిచినా 11వ స్థానానికి కూడా ఎగబాకలేదు. 11వ స్థానంలో ఉన్న యూపీ యోధాస్ (29 పాయింట్లు)ను దాటలేదు. మరోవైపు తెలుగు టైటాన్స్పై విజయం సాధించిన పట్నా పైరేట్స్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. ఇప్పటికే జైపుర్ పింక్ పాంథర్స్, పుణెరి పల్టాన్, గుజరాత్ జెయింట్స్, దబాంగ్ ఢిల్లీ ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

ప్లేఆఫ్స్లో అయిదు స్థానాలు ఖరారు కాగా, చివరి బెర్తు కోసం రెండు జట్లు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. హర్యానా స్టీలర్స్, బెంగాల్ వారియర్స్ జట్లు రేసులో ఉన్నాయి. అయితే బెంగాల్ జట్టు కంటే హర్యానా టీమ్కు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. మరో మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం హర్యానా 60 పాయింట్లు, బెంగాల్ 54 పాయింట్లు సాధించాయి.

ఇక తెలుగు టైటాన్స్-పట్నా పైరేట్స్ మ్యాచ్ విషయానికొస్తే.. టైటాన్స్ గట్టిపోటీనిచ్చింది. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి మన జట్టు 22-20 పాయింట్లతో ఆధిక్యంలో నిలిచింది. కానీ సెకండ్ హాఫ్లో అదే జోరును కొనసాగించలేకపోయింది. రెండు పాయింట్ల తేడాతో ఓటమిపాలైంది. తెలుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ సెహ్రవత్ (16 పాయింట్లు) మరోసారి పోరాడాడు. పట్నా జట్టులో మంజీత్ (8 పాయింట్లు) టాప్ స్కోరర్.