ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ మరోసారి నిరాశపర్చింది. పేలవమైన ఆటతీరుతో మరో పరాజయాన్ని చవిచూసింది. ముంబయి వేదికగా గుజరాత్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 30-37 పాయింట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు పది మ్యాచ్లు ఆడిన టైటాన్స్కు ఇది తొమ్మిదో ఓటమి.
ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి తెలుగు టైటాన్స్దే ఆధిపత్యం. రైడింగ్, ట్యాకిల్లో సత్తాచాటి 19-14 పాయింట్లతో గుజరాత్పై పైచేయి సాధించింది. కానీ రెండో అర్ధభాగంలో అదే జోరును కొనసాగించలేకపోయింది. రైడింగ్, డిఫెండింగ్లో విఫలమై వరుసగా పాయింట్లు కోల్పోయి ఓటమి పాలైంది. తెలుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ సెహ్రావత్ ఎనిమిది పాయింట్లు, ఆల్రౌండర్ సంజీవి ఏడు పాయింట్లు ,డిఫెండర్ నితీశ్ అయిదు పాయింట్లతో పోరాడారు.

గుజరాత్ జెయింట్స్ జట్టులో రైడర్ రాకేశ్ సూపర్-10 సాధించాడు. డిఫెండర్ దీపక్ తొమ్మిది పాయింట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముంబయి వేదికగా శనివారం జరిగిన మరో మ్యాచ్లో యూ ముంబాపై జైపుర్ పింక్ పాంథర్స్ 41-31తో ఘన విజయాన్ని సాధించింది. జైపుర్ రైడర్ అర్జున్ దేశ్వాల్ (17) పాయింట్లతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. అజిత్ (6), అంకుశ్ (5) పాయింట్లు సాధించారు.
తొలి అర్ధభాగం ముగిసేసరికే యూ ముంబా 13-22 పాయింట్లతో వెనుకంజలో ఉంది. కానీ సెకండ్ హాఫ్లో పుంజుకుని పాయింట్లు సాధించింది. అయితే వారి పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగింది. యూ ముంబా జట్టులో రైడర్ గుమన్ సింగ్ (13) పోరాడాడు.పాయింట్ల పట్టికలో పుణెరి పల్టాన్, గుజరాత్ జెయింట్స్, జైపుర్ పింక్ పాంథర్స్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. టేబుల్ అట్టడుగున తెలుగు టైటాన్స్ ఉంది.
ఇవాళ జరగనున్న మ్యాచ్లలో ముంబయి వేదికగా పుణెరి పల్టాన్తో తమిళ తలైవాస్ రాత్రి 8 గంటలకు తలపడనుంది. రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యే మరో మ్యాచ్లో బెంగళూరు వారియర్స్తో హర్యానా స్టీలర్స్ పోటీపడనుంది.