ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్ హొరాహొరీగా సాగుతోంది. ముంబయిలోని ఎన్ఎస్సీఐ మైదానం వేదికగా బుధవారం జరిగిన యు ముంబా- హర్యానా స్టీలర్స్ మ్యాచ్ 'టై'గా ముగిసింది. నువ్వానేనా అన్నట్టుగా సాగిన ఈ మ్యాచ్లో ఇరు జట్లు ఆఖరి వరకు పోరాడి 44-44 స్కోరుతో సమంగా నిలిచాయి.
అయితే తొలి అర్ధభాగం ముగిసేసరికి 23-20తో హర్యానా స్టీలర్స్ పైచేయి సాధించింది. ట్యాకిల్లో ఇరు జట్లు సమవుజ్జీలుగా నిలిచినా రైడింగ్లో హర్యానా సత్తాచాటింది. దీంతో మూడు పాయింట్లు ఆధిక్యంతో సెకండ్ హాఫ్కు హర్యానా పోటీలో దిగింది. కానీ సెకండ్ హాఫ్లో పరిస్థితి తారుమారైంది. రెండో అర్ధభాగంలో యు ముంబా రైడర్లు చెలరేగారు. మరోవైపు హర్యానా డిఫెండర్లు విజృంభించడంతో మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. చివరి రైడ్స్ ఇరు జట్లు పాయింట్లు లేకుండా ముగించడంతో మ్యాచ్ టై గా ముగిసింది.

యు ముంబాలో ఆల్రౌండర్ అమీర్ మహమ్మద్ 14 పాయింట్లతో సత్తాటాడు. రైడర్ గుమన్ సింగ్ 7 పాయింట్లు సాధించాడు. మరోవైపు హర్యానా స్టీలర్స్లో కెప్టెన్, డిఫెండర్ జయదీప్ ఎనిమిది పాయింట్లతో రాణించాడు. రంజిత్, వినయ్, సిద్ధార్థ్ తలో ఏడు పాయింట్లు సాధించారు.
అంతకుముందు జరిగిన మ్యాచ్లో యూపీ యోధాస్ను తమిళ్ తలైవాస్ 46-27తో చిత్తు చేసింది. ఏడు ఓటముల తర్వాత తమిళ్ తలైవాస్ విజయాన్ని అందుకోవడం విశేషం. ఆది నుంచి దూకుడుగా ఆడిన తలైవాస్ ప్రత్యర్థి జట్టును ఏడో నిమిషంలోనే ఆలౌట్ చేసి 11-2తో భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఫస్ట్ హాఫ్ ముగిసేవరకు అదే జోరును ప్రదర్శిస్తూ 19-11తో నిలిచింది.
అయితే సెకండ్ హాఫ్లో యూపీ యోధాస్ పుంజుకున్నా ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగింది. ఆల్రౌండ్ షోతో తమిళ్ తలైవాస్ పాయింట్లు సాధిస్తూ నెగ్గింది. విజయంలో నరేందర్ (14) కీలకపాత్ర పోషించాడు. ఇవాళ జైపుర్ వేదికగా తెలుగు టైటాన్స్-జైపుర్ పింక్ పాంథర్స్, పుణెరి పాల్టాన్-గుజరాత్ జెయింట్స్ మ్యాచ్లు జరగనున్నాయి.