ప్రోకబడ్డీ లీగ్ పదో సీజన్ హొరాహొరీగా సాగుతోంది. జైపుర్ వేదికగా ఎస్ఎమ్ఎస్ ఇండోర్ స్టేడియంలో పాట్నా పైరేట్స్తో జరిగిన మ్యాచ్లో తమిళ్ తలైవాస్ ఘన విజయం సాధించింది. 41-25 పాయింట్ల తేడాతో పైరేట్స్ను చిత్తుగా ఓడించింది. ఈ సీజన్లో 13 మ్యాచ్లు ఆడిన తమిళ్ తలైవాస్కు ఇది నాలుగో విజయం.
ఆది నుంచి పాట్నా పైరేట్స్పై తమిళ్ తలైవాస్ ఆధిపత్యం చెలాయించింది. రైడర్లను మించి డిఫెండర్లు చెలరేగిపోయారు. తొలి అర్ధభాగంలో 8 రైడ్ పాయింట్లతో, 10 ట్యాకిల్ పాయింట్లు సాధించారు. మరోవైపు పైరేట్స్ రైడింగ్లో కాస్త పోటీ ఇవ్వడంతో ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి 20-11 స్కోరు నమోదైంది. తొమ్మిది పాయింట్లతో తలైవాస్ ఆధిక్యంలో నిలిచింది.

సెకండ్ హాఫ్లో తమిళ్ తలైవాస్ అదే జోరును కొనసాగించింది. పాట్నా పైరేట్స్కు అవకాశం ఇవ్వకుండా పాయింట్లతో హోరెత్తించింది. రెండో అర్ధభాగంలోనూ తలైవాస్ డిఫెండర్లు 11 పాయింట్లతో సత్తాచాటడం విశేషం. మరోవైపు పాట్నా పైరేట్స్ చేసిన పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగింది.
తమిళ్ తలైవాస్ జట్టులో డిఫెండర్లు అభిషేక్ ఏడు, సాహిల్ అయిదు, సాగర్ నాలుగు పాయింట్లతో సత్తాచాటారు. రైడర్లలో అజింక్య పవార్ సూపర్-10 సాధించగా, నరేందర్ ఆరు పాయింట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు పాట్న పైరేట్స్లో రైడర్ సుధాకర్ (8) టాప్ స్కోరర్. ఇవాళ జైపుర్ వేదికగా రెండు మ్యాచ్లు జరగనున్నాయి. రాత్రి 8 గంటలకు దబాండ్ ఢిల్లీతో గుజరాత్ జెయింట్స్ తలపడనుంది. అలాగే రాత్రి 9 గంటలకు జైపుర్ పింక్ పాంథర్స్తో హర్యానా స్టీలర్స్ పోటీపడనుంది.
పాయింట్ల పట్టికలో జైపుర్ పింక్ పాంథర్స్, పుణెరి పల్టాన్, దబాంగ్ దిల్లీ, గుజరాత్ జెయింట్స్ టాప్-4లో నిలిచాయి. తెలుగు టైటాన్స్ అట్టడుగన నిలిచింది. ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడిన టైటాన్స్ కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది.