అహ్మదాబాద్: ప్రొకబడ్డీ లీగ్ సీజన్-7 తుది అంకానికి చేరింది. ఉత్కంఠభరితంగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్ల్లో బెంగళూరు బుల్స్, యూ ముంబా జట్లు విజయాలు అందుకుని సెమీఫైనల్స్కు చేరుకున్నాయి. సోమవారం రాత్రి ఆహ్మదాబాద్ ఇకా ఎరీనా స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్-1 మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 48-45 యూపీ యోధాపై విజయం సాధించింది. ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగగా.. బుల్స్ స్టార్ రైడర్ పవన్ కుమార్ షెరావత్ (20 పాయింట్లు) విజృంభించడంతో బెంగళూరు సునాయాస విజయాన్ని అందుకుంది. యూపీ జట్టులో రైజర్లు రిశాంక్ దేవడిగ (11పాయింట్లు), శ్రీకాంత్ యాదవ్ (9పాయింట్లు) రాణించారు.
IND vs SA: కీపర్గా సాహా అదుర్స్ .. పంత్కు జట్టులో చోటెక్కడ?!!
యూపీ యోధా మ్యాచ్ ప్రారంభంలో జోరు ప్రదర్శించింది. ఎనిమిదో నిమిషంలోనే బెంగళూరును ఆలౌట్ చేసి 11-4తో దూసుకెళ్లింది. ఆ తర్వాత కూడా ఆధిక్యాన్ని కొనసాగించిన యూపీ 19-11తో నిలిచింది. ఈ సమయంలో బుల్స్ రైడర్ పవన్ విజృంభించి సూపర్ రైడ్తో యూపీని ఆలౌట్ చేసి ఆధిక్యాన్ని తగ్గించాడు. తొలి అర్ధ భాగం ముగిసే సరికి యూపీ 20-17తో ముందంజలో నిలిచింది.
రెండో అర్ధ భాగంలోనూ పవన్ షెరావత్ను కట్టిడి చేసిన యూపీ.. 32-25తో ఆధిక్యంలోనే నిలిచింది. ఐదు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా.. 34-26తో యూపీ విజయం దిశగా దూసుకెళ్లింది. అయితే బుల్స్లో సుమీత్ సింగ్ పాయింట్లు సాధించడంతో పోరు హోరాహోరీగా సాగింది. చివర్లో బెంగళూరు రైడర్ పవన్ కీలక పాయింట్లతో ఆకట్టుకోవడంతో 40 నిమిషాల సమయం ముగిసే సరికి 36-36తో పాయింట్లు సమం అయ్యాయి. దీంతో ఆరు నిమిషాల అదనపు సమయంలో పవన్ షెరావత్ సూపర్ రైడింగ్తో బెంగళూరు విజయం సాధించింది.
అనంతరం జరిగిన రెండో ఎలిమినేటర్లో యూ ముంబా 46-38తో హర్యానా స్టీలర్స్పై సునాయాస విజయం సాధించింది. ముంబా తరుపున అభిషేక్ సింగ్ 16 రైడ్ పాయింట్లు, అర్జున్ దేశ్వాల్ 15 రైడ్ పాయింట్లు సాధించారు. హర్యానా తరపున వికాస్ ఖండోల 12 రైడ్ పాయింట్లు చేసినా.. అతనికి సహకారం అందించేవారు లేక ఓటమిని చవిచూసింది. బుధవారం సెమీస్ మ్యాచ్లు జరుగుతాయి. బెంగళూరు vs ఢిల్లీ, బెంగాల్ vs ముంబా జట్లు తలపడుతాయి.