న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్లో హర్యానా స్టీలర్స్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించడంలో విఫలమైంది. వరుసగా 9 మ్యాచ్ల్లో గెలుపు రుచి చూడని యూపీ యోధ ఎట్టకేలకు విజయం సాధించింది. గురువారం హోరాహోరీగా సాగిన మ్యాచ్లో 30-29 తేడాతో హరియాణా స్టీలర్స్పై జయకేతనం ఎగరవేసింది. యోధ జట్టులో శ్రీకాంత్, ప్రశాంత్ చెరో 8 పాయింట్లు, సచిన్ 6, నితీశ్ కుమార్ 4, జీవన్ 2 పాయింట్లు సాధించారు.
ప్రొ కబడ్డీ ఆరో సీజన్లో నాలుగో విజయాన్ని నమోదు చేసింది. గత 9 మ్యాచ్ల్లో ఏడింట్లో ఓడిన యూపీ.. 2 మ్యాచ్లను టై చేసుకుంది. నిజానికి ఈ మ్యాచ్లోనూ యూపీకి ఓటమి తప్పదేమో అనిపించింది. మోను గోయత్ (11) రైడింగ్లో సత్తాచాటడంతో హరియాణా ఓ దశలో 14-9తో ఆధిక్యంలో నిలిచింది. హర్యానా తరఫున మోను గోయట్ 11, వికాస్ 7 పాయింట్లతో చెలరేగినా ప్రయోజనం లేకపోయింది.
What an exciting end to a panga-packed leg!
— ProKabaddi (@ProKabaddi) December 6, 2018
See the 💥💥 #UPvHAR and #DELvCHE clashes in photos below.
Click on https://t.co/In5qqtxa4S for more exciting images from #VivoProKabaddi! pic.twitter.com/svjWfXIEh7
విరామం తర్వాత ప్రశాంత్ (8), శ్రీకాంత్ (8) చెలరేగడంతో యూపీ పుంజుకొని 20-20తో స్కోరు సమం చేసింది. మరో నాలుగు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా యూపీ 27-26తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆధిక్యాన్ని ఆఖరి వరకు నిలబెట్టుకుంది. ఈ పరాజయంతో హరియాణా స్టీలర్స్ ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది.
మరో మ్యాచ్లో దబాంగ్ ఢిల్లీ 37-33తో తమిళ్ తలైవాస్పై నెగ్గింది. ఢిల్లీ జట్టులో మిరాజ్ 9, నవీన్ 8, విశాల్ 5 పాయింట్లు సాధించారు. తమిళ్ జట్టు తరఫున అజయ్ 14 పాయింట్ల తెచ్చాడు. సుకేశ్ హెగ్డే, అతుల్ చెరో 5 పాయింట్లు సాధించారు. ప్రొ కబడ్డీ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. శుక్రవారం నుంచి విశాఖపట్నంలో మ్యాచ్లు జరగనున్నాయి.