వైజాగ్: వరుసగా రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి ఫామ్లోకి వచ్చిన తెలుగు టైటాన్స్ మళ్లీ ట్రాక్ తప్పింది. ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా బుధవారం జరిగిన జోన్- బి మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 24-37తో బెంగళూరు బుల్స్ చేతిలో ఓడింది. పదేపదే అవే తప్పుల్ని చేస్తున్న తెలుగు టైటాన్స్ సొంతగడ్డపై వరుసగా రెండో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. మ్యాచ్ ఆరంభంలో టైటాన్స్ దూకుడు ప్రదర్శించింది. ఆట 4వ నిమిషం వరకూ 4-1తో ఆధిక్యంలోకి వెళ్లిన టైటాన్స్.. ఓ దశలో 10-6తో బెంగళూరుపై ఆధిపత్యం చెలాయించింది.
రైడింగ్లో, ట్యాక్లింగ్లో మెరిసి అదే ఊపుతో తొలి అర్ధభాగాన్ని 12-10 స్కోరుతో ముగించింది. అయితే ప్రత్యర్థి జట్టులో పవన్ షెరావత్ (13) రైడింగ్లో రాణించడంతో కేవలం రెండు పాయింట్ల (12-10) ఆధిక్యంతో టైటాన్స్ తొలి అర్ధభాగాన్ని ముగించింది. విరామం తర్వాత పవన్ మరింత వేగంగా ఆడడంతో బెంగళూరు 26వ నిమిషంలో 20-14తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే నీలేశ్ (6) పాయింట్లు తేవడంతో టైటాన్స్ ఓ దశలో 19-22తో ప్రత్యర్థిని సమీపించింది.
బెంగళూరు ఆటగాడు మహేందర్ (5) ట్యాక్లింగ్లో ఆటగాళ్లను పట్టేయడంతో మరో రెండు నిమిషాలు ఆట ఉందనగా టైటాన్స్ 24-34తో పూర్తిగా వెనకబడింది. దాంతో జట్టు పరాజయం ఖాయమైంది. టైటాన్స్ అగ్రశ్రేణి రైడర్ రాహుల్ చౌదరి (4) పూర్తిగా విఫలమయ్యాడు. 18 మ్యాచ్ల్లో 10 ఓటములతో టైటాన్స్ ప్లేఆఫ్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఈ గెలుపుతో బెంగుళూరు క్వాలిఫైయర్స్ అవకాశాలు కూడా మెరుగుపడ్డాయి.
మరో మ్యాచ్లో గుజరాత్ ఫార్చ్యూన్జెయింట్స్ 47-37తో హరియాణా స్టీలర్స్పై విజయం సాధించింది. గుజరాత్ తరపున ప్రపంజన్ (12), సచిన్ (10) రాణించారు. స్టీలర్స్ జట్టులో మోను గోయత్ (11), నవీన్ (7) ఆకట్టుకున్నారు. సొంతగడ్డపై జరిగే చివరి మ్యాచ్లో గురువారం పట్నా పైరేట్స్తో తెలుగు టైటాన్స్ తలపడనుంది.