హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 35-24తో తమిళ్ తలైవాస్ను చిత్తు చేసింది. పైరేట్స్ స్టార్ రైడర్ మోను గోయత్ 11 పాయింట్లు సాధించి గెలపులో కీలకపాత్ర పోషించాడు. ఆరంభం నుంచే పట్నా ఆటగాళ్లకు తలైవాస్ ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది.
అజయ్ ఠాకూర్ (10) రాణించినా తలైవాస్ను గెలిపించలేకపోయాడు. ఈ విజయంతో ఏడు మ్యాచ్ల్లో 27 పాయింట్లు సాధించిన పట్నా జోన్-బిలో రెండో స్థానంలో కొనసాగుతోంది.

ముంబాపై పుణెరి ఉత్కంఠ విజయం
ప్రొ కబడ్డీ లీగ్లో సొంతగడ్డపై యు ముంబాకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. శనివారం ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో పుణెరి పల్టన్ 26-24తో యు ముంబాపై విజయం సాధించింది. పుణెరి ప్లేయర్ దీపక్ నివాస్ హుడా 7 రైడ్ పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్లో ఇరు జట్లూ చెరోసారి ఆలౌటయ్యాయి. ఆరంభం నుంచి ముంబా ఆధిక్యంలో కొనసాగినా.. పుణె అద్భుతంగా పుంజుకుని విజయం సాధించింది. తొలి అర్ధభాగంలో 10 నిమిషాలు ముగిసే సరికి ముంబా 6-4తో ఆధిక్యంలో నిలిచింది. చివరి ఏడు నిమిషాల్లో కెప్టెన్ అనూప్ కుమార్ రైడ్తో ముంబా 11-4 మంచి ఆధిక్యం సాధించింది.
ఇక, తొలి అర్ధభాగాన్ని యు ముంబా జట్టు 15-9తో ముగించింది. అయితే రెండో అర్ధభాగంలో యు ముంబా జట్టు పుంజుకున్న తీరు అద్భుతం. ముంబా రైడర్లు ఎక్కువగా ఖాళీ చేతులతో రాగా.. పుణె ఒక్కొక్క పాయింట్ సాధిస్తూ అంతరాన్ని తగ్గించింది. దీపక్ రైడ్తో స్కోరు 23-23తో సమమైంది.
యు ముంబా ప్లేయర్ కాశీలింగ్ను పట్టేయడంతో పుణె 24-23తో తొలిసారి పైచేయి సాధించింది. చివర్లో పుణె రెండు పాయింట్లు సాధించి మ్యాచ్లో నెగ్గింది. యు ముంబా జట్టులో కాశీలింగ్ ఆద్కే 7 పాయింట్లు సాధించినా జట్టు ఓటమిని తప్పించలేకపోయాడు. మొత్తంగా పుణెరి పల్టన్ 14 రైడింగ్, 8 ట్యాకిల్, 2 ఆలౌట్, 2 ఎక్స్ట్రా పాయింట్లు సాధించగా, ముంబా జట్టు 13 రైడింగ్, 8 ట్యాకిల్, 2 ఆలౌట్, 1ఎక్స్ట్రా పాయింట్లు సాధించింది.