హైదరాబాద్: ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్)-5వ సీజన్ తొలి మ్యాచ్లో తెలుగు టైటాన్స్ మెరిసినా, రెండో మ్యాచ్లో పోరాడి ఓడిన ఆ జట్టు.. మూడో మ్యాచ్కు వచ్చేసరికి పూర్తిగా తేలిపోయింది. ఆదివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 21-31తో బెంగళూరు బుల్స్ చేతిలో పరాజయం చవిచూసింది.
ఈ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ ఆటగాళ్లు మూకుమ్మడిగా విఫలమయ్యారు. కెప్టెన్ రాహుల్ చౌదరిపై అధికంగా భారం వేసిన తెలుగు టైటాన్స్ భారీ మూల్యం చెల్లించుకుంది. రాహుల్ స్థాయికి తగ్గట్లు రాణించకపోవడంతో పాటు మిగతా ఆటగాళ్లలో కసి లోపించడం టైటాన్స్ను దెబ్బతీసింది.
కెప్టెన్ రాహుల్ చౌదరి, రాకేశ్ కుమార్ చెరో నాలుగు పాయింట్లు సాధించగా, వికాస్, నీలేశ్ మూడేసి పాయింట్లు చేశారు. ప్రత్యర్థి జట్టులో మాత్రం రోహిత్ కుమార్ (12 పాయింట్లు) అద్భుత ప్రదర్శన కనబరిచాడు. బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రైడింగ్కు వెళ్లిన ప్రతీసారి పాయింట్లు తెచ్చిపెట్ట డంలో సఫలమయ్యాడు.

మరో ఆటగాడు అజయ్ కుమార్ 7 పాయింట్లు సాధించాడు. టాకిల్లో మహేందర్ సింగ్ తెలుగు టైటాన్స్ ఆటగాళ్లను సమర్థంగా కట్టడి చేశాడు. ఏకంగా రెండుసార్లు ఆలౌటైంది. అర్ధభాగం ముగిసేసరికి 15-10తో ఆధిక్యంలో నిలిచిన బెంగళూరు ద్వితీయార్ధంలోనూ జోరు కొనసాగించింది.
టైటాన్స్ రక్షణ శ్రేణి పూర్తిగా విఫలమవడంతో ప్రత్యర్థి రైడర్లు దూసుకుపోయారు. రోహిత్ 10 పాయింట్లతో సూపర్-10 సాధించాడు. పీకేఎల్లో అతనికి ఏడో సూపర్-10. ద్వితీయార్ధంలో రాహుల్ 10 నిమిషాలు బెంచ్కే పరిమితమవడంతో టైటాన్స్ ఓటమి ఖాయమైపోయింది.
ఆఖర్లో అజయ్ సూపర్ రైడ్ చేసి 3 పాయింట్లు గెలిచాడు. బెంగళూరు రైడర్లలో రోహిత్తో పాటు అజయ్ కుమార్ రాణించాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో బెంగళూరు రైడింగ్లో 17, టాకిల్లో 9 పాయింట్లు సాధించగా, హైదరాబాద్ రైడింగ్లో 15, టాకిల్లో కేవలం రెండే పాయిం ట్లు సాధించింది.
బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించిన రోహిత్ కుమార్కు 'పర్ఫెక్ట్ రైడర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. అజయ్ కుమార్కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది. మూడు మ్యాచ్లాడిన తెలుగు టైటాన్స్ జట్టుకిది వరుసగా రెండో పరాజయం కాగా... ఆడిన తొలి మ్యాచ్లోనే బెంగళూరు గెలుపుతో టోర్నీలో శుభారంభం చేసింది.
ఇదిలా ఉంటే ప్రొ కబడ్డీ లీగ్లో రాహుల్ చౌదరి అరుదైన ఘనత సాధించాడు. 500 రైడ్ పాయింట్ల మైలురాయిని అందుకున్నాడు. ఆదివారం బెంగళూరుతో మ్యాచ్లో అతడు ఈ ఘనత సాధించాడు.