హైదరాబాద్: ప్రొ కబడ్డీ ఐదో సీజన్లో నాగ్పుర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో సచిన్ జట్టు తమిళ్ తలైవాస్ బోణీ కొట్టలేకపోయింది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో తమిళ్ తలైవాస్ ఒక్క పాయింట్ తేడాతో ఓటమి పాలైంది. తమిళ్ తలైవాస్కు ఇది వరుసగా రెండో ఓటమి.
శుక్రవారం జరిగిన మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 32-31తో తలైవాస్పై ఒక్క పాయింట్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్ ప్రేక్షకులకు చక్కని అనుభూతిని పంచింది. ఏకపక్షంగా మొదలైన ఈ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠ మధ్య ముగిసింది. తమిళ్ తలైవాస్ ఆటగాళ్లు అద్భుత పోరాట పటిమ చూపించారు.

అజయ్ ఠాకూర్ రైడింగ్లో విఫలం కావడం, డిఫెండర్ల మధ్య సమన్వయం లేకపోవడంతో తొలి అర్ధభాగంలో తమిళ్ తలైవాస్ రెండుసార్లు ఆలౌటై 8-23తో ముగించింది. బుల్స్ సారథి రోహిత్ ఫస్టాఫ్లో పదింటిలో ఎనిమిది సక్సెస్ఫుల్ రైడ్స్ చేశాడు. ఇక రెండో అర్ధభాగంలో తలైవాస్ ఒక్కసారిగా విజృంభించింది.
31వ, 38వ నిమిషాల్లో ప్రత్యర్థి ని రెండుసార్లు ఆలౌట్ చేసింది. ఇక, ఆఖరి నిమిషంలో ప్రపంజన్ సక్సెస్ఫుల్ రైడ్తో పాటు టెక్నికల్ పాయింట్ దక్కించుకున్న తలైవాస్ 30-31తో నిలవడంతో ఉత్కంఠ నెలకొంది. ఆఖరి రైడ్లో రోహిత్ను అవుట్చేస్తే మ్యాచ్ టై అయ్యేదే. కానీ, అతను పాయింట్ సాధించక పోవడంతో బుల్స్దే పైచేయి అయింది.