హైదరాబాద్: క్రీడాభిమానులకు ఊరటగా మరో సంరంభం వచ్చేసింది. కళ్లు చెదిరే భారీ షాట్లు, మెరుపు బౌండరీలు, సూపర్ మ్యాన్ క్యాచ్లు మే 27 ఐపీఎల్తో ముగిశాయి. ఈ క్రమంలో క్రీడా ఆసక్తి ఉన్న వారి కోసం మరో లీగ్ సిద్ధమైంది. కబడ్డీ.. కబడ్డీ.. బోనస్ పాయింట్లు.. సూపర్ రైడ్.. సూపర్ ట్యాకిల్ పదాలతో అలరించేందుకు ప్రొ కబడ్డీ లీగ్ రానే వచ్చింది.
ఏప్రిల్ 30, 31న పీకేఎల్ సీజన్ 6లో ఆటగాళ్ల వేలం జరగనుంది. రెండు రోజుల వేలం ప్రక్రియలో మొత్తం 422 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఇరాన్, బంగ్లాదేశ్, జపాన్, కెన్యా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మలేసియా, శ్రీలంక సహా మొత్తం 13 దేశాలకు చెందిన 58 మంది విదేశీ ఆటగాళ్లు వేలంలోకి రానున్నారు. మొత్తం 12 ప్రాంఛైజీల్లో తొమ్మిది ప్రాంఛైజీలు 21 మంది ఆటగాళ్లను తమవద్దే అట్టిపెట్టుకున్నాయి.
యూపీ యోధా, యు ముంబా, జైపుర్ పింక్ పాంథర్స్ మాత్రం ఎవరినీ తమ వద్ద అట్టిపెట్టుకోలేదు. ప్రతి ప్రాంఛైజీ పర్స్ రూ.4 కోట్లు కాగా ఒక్కో ప్రాంఛైజీ 18-25 మంది ఆటగాళ్లను తీసుకోవచ్చు. నాలుగు కోట్ల రూపాయల వరకూ జట్టుకు కేటాయించుకునేందుకు వీలున్న జట్టు 4 విదేశీ ప్లేయర్లను తీసుకోవచ్చు. ఈ వేలంలో ప్లేయర్లను నాలుగు కేటగిరీలుగా కేటాయించి వేలం నిర్వహించనున్నారు. ఏ, బీ, సీ, డీలతో పాటు కొత్త ఆటగాళ్లకు ఓ కేటగిరినీ ఉంచడంతో దానికి అనుగుణంగా ధరలను నిర్ణయించారు.
ఏ, బీ, సీ, బీ, కొత్త కేటగిరీలకు 20, 12, 8, 5, 6.6 లక్షల రూపాయల్లో ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నారు. సీజన్ ప్రారంభ తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సీజన్కు 18 నగరాల నుంచి 3500 మంది వరకు ఆటగాళ్లు అర్హత పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీళ్లలో 240 మంది ఆటగాళ్లకు ఫేజ్ 2కు ఎంచుకోబడ్డారు. అంటిపెట్టుకున్న ఆటగాళ్లను మినహాయించి 87 మంది ప్లేయర్లను కొత్తగా వేలంలో కొనుగోలు చేయనున్నారు.