
కోల్కతా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించిన తెలుగు టైటాన్స్ జట్టు మంగళవారం జరిగిన మ్యాచ్తో ఓటమితో టోర్నీ నుంచి తప్పుకుంది. ఈ మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 39-34 స్కోరు తేడాతో టైటాన్స్పై విజయం సాధించింది. సీజన్ తొలి సగంలో జోరు కనబరిచిన టైటాన్స్ చివరి 13 మ్యాచ్ల్లో కేవలం మూడింట మాత్రమే నెగ్గి చేజేతులా 'ప్లే ఆఫ్స్' అవకాశాలను దూరం చేసుకుంది. మంగళవారం మ్యాచ్లో స్టార్ రైడర్లు రాహుల్ చౌదరి, నిలేశ్ బరిలో దిగలేదు.
అర్మాన్ 13 పాయింట్లతో పోరాడాడు. వారియర్స్ తరఫున మణిందర్ సింగ్ 12, సుర్జీత్ సింగ్ 7 పాయింట్లు సాధించారు. జోన్ 'బి'లో 22 మ్యాచ్లు ఆడిన టైటాన్స్ 8 విజయాలు, 13 పరాజయాలు, ఒక 'డ్రా'తో 51 పాయింట్లు సాధించి పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. ఆది నుంచే ప్రత్యర్థి బెంగాల్ దూకుడుకు సరైన పోటీనివ్వని టైటాన్స్..
కీలక పాయింట్లు సమర్పించుకున్నది. దీంతో ప్రథమార్ధం ముగిసే సరికి 16-23తో వెనుకంజలో ఉన్న టైటాన్స్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. కీలకమైన ద్వితీయార్ధంలో పోటీనిచ్చేందుకు ప్రయత్నించినా స్వల్ప తేడాతో మ్యాచ్ను కోల్పోవాల్సి వచ్చింది.
టైటాన్స్ తరఫున రైడింగ్లో ఆర్మాన్(11), డిఫెండింగ్లో అబ్జోర్ మిఘానీ(3) రాణించారు. బెంగాల్ జట్టులో రైడర్ మనిందర్ (12), డిఫెండర్ సుర్జీత్ (5) సత్తా చాటారు. కాగా, అంతకుముందు హరియాణా స్టీలర్స్, తమిళ్ తలైవాస్ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆఖరికి 40-40తో స్కోరు సమమైంది. తలైవాస్ 40-38తో ఆధిక్యంలో ఉన్న దశలో హరియాణా ఆఖరి నిమిషంలో రెండు పాయింట్లు సాధించి పరాజయాన్ని తప్పించుకుంది. హరియాణా తరఫున మోను గోయత్ 17 పాయింట్లు.. తలైవాస్ నుంచి అజయ్ ఠాకూర్ 17 పాయింట్లు సాధించి మ్యాచ్లో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేస్ నుంచి తప్పుకొన్న ఇరుజట్లు తమ జోన్లో చివరి స్థానాల్లో నిలిచాయి.
మరోవైపు హరియాణా స్టీలర్స్-తమిళ్ తలైవాస్ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన ఇంటర్ జోనల్ మ్యాచ్ 40-40తో టైగా ముగిసింది. జోన్ 'ఎ'లో హరియాణా చివరి స్థానంలో నిలవగా... జోన్ 'బి'లో తమిళ్ తలైవాస్ చివరి స్థానంతో సీజన్ ముగించింది. బుధవారం జరగనున్న మ్యాచ్లలో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో పట్నా పైరేట్స్, బెంగాల్ వారియర్స్తో బెంగళూరు బుల్స్ తలపడనున్నాయి. ఇప్పటికే జోన్ 'ఎ' నుంచి గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్, యు ముంబా, దబంగ్ ఢిల్లీ... జోన్ 'బి' నుంచి బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్ 'ప్లే ఆఫ్' దశకు అర్హత సాధించాయి. చివరిదైన ఆరో బెర్త్ కోసం పట్నా పైరేట్స్ (55 పాయింట్లు), యూపీ యోధ (52 పాయింట్లు) జట్లు రేసులో ఉన్నాయి.