మ్యాచ్ ఆరంభంలో ఢిల్లీ జోరుతో మ్యాచ్ ఏకపక్షంగా మారుతుందని భావించారు. కానీ.. పుంజుకున్న బెంగాల్ వ్యూహాత్మకంగా ఆడుతూ స్కోర్లు సమం చేసింది. చంద్రన్ రంజిత్ రైడ్తో ఖాతా తెరిచిన ఢిల్లీ.. 5 నిమిషాల ఆట ముగిసేసరికి 7-2తో దూసుకుపోయింది. ఆ తర్వాత నిమిషంలో బెంగాల్ను ఆలౌట్ చేసి 11-3తో ఆధిక్యంలోకి వెళ్ళింది. ఈ సమయంలో డిఫెండర్లు సుకేష్, నబీబక్ష్ వరుసగా పాయింట్లు తేవడంతో బెంగాల్ పుంజుకుంది. 12వ నిమిషంలో బెంగాల్ 8-13తో నిలిచింది. 15వ నిమిషంలో ఢిల్లీని ఆలౌట్ చేయడంతో బెంగాల్ 14-15తో మ్యాచ్లోకి వచ్చింది. అనంతరం 17-17తో స్కోర్లు సమం చేసి తొలి భాగాన్ని ముగించింది.
రెండో అర్ధ భాగంలో చంద్రన్ రంజిత్ను నబీబక్ష్ పట్టేయడంతో బెంగాల్ 18-17తో ముందంజ వేసింది. ఆ తర్వాత పలుమార్లు స్కోర్లు సమమైనా.. 26వ నిమిషంలో మరోసారి ఢిల్లీని ఆలౌట్ చేసిన బెంగాల్ 25-21తో ఆధిక్యం సంపాదించింది. ఇక మరో 5 నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా 27-36తో ఉన్న ఢిల్లీ పోరాడింది. ఆధిక్యాన్ని కాపాడుకున్న బెంగాల్ 39-34తో విజయం సాధించింది. సీజన్ మొత్తం అద్భుతంగా రాణిస్తూ వచ్చిన ఢిల్లీ జట్టు తుది మెట్టుపై బోల్తా పడింది. ఆరు సీజన్లలో కనీసం ఫైనల్ చేరని బెంగాల్.. తుదిపోరుకు చేరిన తొలిసారే విజేతగా నిలిచింది.
ఢిల్లీ 27 రైడ్ పాయింట్లు సాధిస్తే.. బెంగాల్ 22 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ట్యాక్లింగ్లో వారియర్స్ 10 పాయింట్లు చేజిక్కించుకుంటే.. ఢిల్లీ మాత్రం కేవలం 3 పాయింట్లే సాధించింది. జూలై 20న హైదరాబాద్ వేదికగా ప్రారంభమైన పీకేఎల్ ఏడో సీజన్.. మూడు నెలల తర్వాత శనివారంతో ముగిసింది. మ్యాచ్ అనంతరం కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజిజు విజేతలకు బహుమతులు అందజేశారు. విజేత బెంగాల్ వారియర్స్కు రూ. 3 కోట్లు.. రన్నరప్ ఢిల్లీకి రూ. కోటీ 80 లక్షలు ప్రైజ్మనీగా లభించాయి.