
పట్నా: ప్రొ కబడ్డీ ఏడో సీజన్-7లో తెలుగు టైటాన్స్ ఆటతీరులో ఎలాంటి మార్పులేదు. జట్టుగా విఫలమయి మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది. టైటాన్స్ను ఆటను చూస్తే ఈ సీజన్లో ఇప్పట్లో బోణీ కొట్టేలా కనిపించడం లేదు. గురువారం డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరు బుల్స్తో జరిగిన మ్యాచ్లో 47-26తో టైటాన్స్ పరాజయం పాలైంది. టైటాన్స్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ 11 పాయింట్లతో తొలిసారి సత్తా చాటినా.. టైటాన్స్ గట్టెక్కలేకపోయింది. అద్భుత ఫామ్లో ఉన్న పవన్ సెరావత్ (17) ఆల్రౌండ్ ప్రదర్శనతో బుల్స్కు విజయాన్ని అందించాడు. రోహిత్ కుమార్ (8), మహేందర్ సింగ్ (7) సత్తా చాటారు.
మ్యాచ్ ఆరంభంలో సిద్ధార్థ్ రాణించడంతో టైటాన్స్ ఆధిపత్యం కొనసాగించింది. తొలి మూడు నిమిషాలు ముగిసే సరికి 5-3తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో టైటాన్స్ ఆటతీరులో వేగం తగ్గింది. మరోవైపు రైడర్ పవన్ రెచ్చిపోవడంతో బుల్స్ ఆధిక్యం సాధిస్తూ వెళ్లింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి బుల్స్ 14-21తో నిలిచింది. రెండో అర్ధ భాగంలోనూ పూర్తి ఆధిపత్యం కనబర్చిన బుల్స్కు టైటాన్స్ ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. పవన్ వరుస పాయింట్లు తేవడంతో ఆధిక్యం అంతకంతకు పెంచుకుంటూ అలవోక విజయం సొంతం చేసుకుంది.
ఈ ఓటమితో లీగ్లో మరో పరాజయాన్ని టైటాన్స్ ఖాతాలో వేసుకుంది. ఆడిన 6 మ్యాచ్ల్లో ఐదింటిలో ఓడి, ఒక దాంట్లో 'టై'తో సరిపెట్టుకున్న టైటాన్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుంది. వరుసగా మూడు విజయాలతో బుల్స్ (20) మూడో స్థానంలో నిలిచింది. శుక్రవారం జరిగే మ్యాచ్ల్లో యు ముంబాతో బెంగాల్ వారియర్స్, పట్నా పైరేట్స్తో యూపీ యోధ తలపడతాయి.