
పట్నా: ప్రొ కబడ్డీ లీగ్లో పాట్నా పైరేట్స్ స్టార్ రైడర్, డుబ్కీ కింగ్ పర్దీప్ నర్వాల్ చరిత్ర సృష్టించాడు. ప్రొ కబడ్డీ లీగ్ చరిత్రలో 900 రైడ్ పాయింట్లు సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. పర్దీప్ ఇప్పటి వరకు 39 సూపర్ రైడ్లు, 45 సూపర్ టెన్లు సాధించాడు. అంతేకాదు అతని ఖాతాలో మూడు వివో ప్రో కబడ్డీ టైటిల్స్ కూడా ఉన్నాయి. ఈ సీజన్లో కూడా పర్దీప్ తన ఫామ్ కొనసాగిస్తే 1000 రైడ్ పాయింట్లు కూడా సాధించగలడు.
అతి తక్కువ వ్యవధిలోనే ప్రొ కబడ్డీలో స్టార్ ఆటగాడిగా పర్దీప్ నర్వాల్ పేరు సంపాదించాడు. తొలుత బెంగళూరు బుల్స్కు ఆడిన పర్దీప్.. పట్నాకు వెళ్లిన తర్వాత తన విశ్వరూపం చూపించాడు. ఆ జట్టు తరఫున తొలిసారే అత్యధిక పాయింట్లు సాధించాడు. ఆటగాళ్లు బ్లాక్ చేసినప్పుడు డుబ్కీతో తప్పించుకోవడం పర్దీప్ ప్రత్యేకత. రికార్డులు బద్దలు కొట్టడంలో పర్దీప్ ముందుంటాడు. ఐదో సీజన్లో హరియాణా స్టీలర్స్పై రైడింగ్కి వెళ్లి ఒకేసారి 8 పాయింట్లు తెచ్చి అందరిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు. ఒక్క ఐదో సీజన్లోనే 369 పాయింట్లతో చెలరేగాడు. ఒక్క మ్యాచ్లోనే అత్యధిక పాయింట్ల (34)తో రికార్డు సృష్టించాడు. నాలుగు సీజన్లలో టాప్ రైడర్గా నిలిచాడు.
బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 35-26 స్కోరుతో పట్నా పైరేట్స్పై నెగ్గింది. పర్దీప్ నర్వాల్ (14) సూపర్-10తో మెరిసినా కూడా పట్నా ఓటమి నుండి తప్పించుకోలేకపోయింది. పట్నా జట్టులో పర్దీప్ నర్వాల్ 14 పాయింట్లు సాధించాడు. జట్టు సాధించిన స్కోరులో సగం కంటే ఎక్కువ పాయింట్లు ఇతనివే అయినా.. సహచరుల వైఫల్యంతో జట్టు పరాజయం చవిచూసింది. ఈ మ్యాచులో తొలి పాయింట్ పర్దీప్ సాధించాడు. హరియాణా జట్టులో రైడింగ్లో వికాస్ (10), వినయ్ (6).. ట్యాక్లింగ్లో రవి కుమార్ (4), సునీల్ (4) సత్తా చాటారు. గురువారం జరిగే మ్యాచ్లో బెంగళూరు బుల్స్తో తెలుగు టైటాన్స్ తలపడుతుంది.