న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ ఆరో సీజన్లో యు ముంబా జోరు కొనసాగుతోంది. రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ చెలరేగడంతో యు ముంబా పన్నెండో విజయం నమోదు చేసుకుంది. సిద్దార్థ్ (19) సత్తాచాటాడు. జోన్ 'ఎ'లో భాగంగా శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో యు ముంబా 41-34తో దబంగ్ ఢిల్లీపై గెలుపొందింది. మ్యాచ్లో మొదటి నుంచీ ఆధిపత్యం ఢిల్లీదే. సొంత అభిమానుల సమక్షంలో రెచ్చిపోయి ఆడిన ఢిల్లీ తొలి అర్ధభాగాన్ని 22-13 ఆధిక్యంతో ముగించింది.
ఢిల్లీ రైడర్ నవీన్ (12) రాణించి జట్టుకు పాయింట్లు అందించాడు. అయితే విరామం తర్వాత సిద్ధార్థ్ జోరు పెంచడంతో ఢిల్లీ ఆధిపత్యం తగ్గుతూ వచ్చింది. 9 నిమిషాల ఆట మిగిలుండగా స్కోర్లు 27-27తో సమం అయ్యాయి. ఇక అక్కడి నుంచి ముంబా అదే దూకుడుతో ముందుకు సాగింది.
సిద్ధార్థ్ (19 పాయింట్లు) రైడింగ్లో విజృంభించడంతో క్రమంగా ఆధిక్యాన్ని పెంచుకుంటూ వెళ్లి అలవోకగా గెలిచింది. ఢిల్లీ తరఫున నవీన్ కుమార్ 12 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. జోన్ 'ఎ'లో 17 మ్యాచ్లు ఆడిన యు ముంబా 67 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. జోన్ 'బి'లో 58 పాయింట్లతో బెంగళూరు టాప్లో ఉంది.
ఢిల్లీ ఆటగాళ్లు తిరిగి ప్రతిఘటించడంతో మరో ఐదు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా స్కోరు 30-30తో సమమైంది. ఈ దశలో మ్యాచ్ డ్రాగా ముగిసేలా కనిపించింది. కానీ సూపర్ రైడ్లతో చెలరేగిన సిద్ధార్థ్ తన జట్టుకు విజయాన్నందించాడు. ఆదివారం జరగనున్న మ్యాచ్ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో యు ముంబా, పుణేరి పల్టన్తో దబంగ్ ఢిల్లీ తలపడనున్నాయి.