పుణె: ప్రొ కబడ్డీ లీగ్లో జోన్ 'బి'లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 34-26తో టైటాన్స్పై గెలిచింది. ప్రారంభంలో ఆధిపత్యం చెలాయించినా... చివర్లో ఒత్తిడికి గురైన తెలుగు టైటాన్స్ ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లో ఆరో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ సీజన్లో తొలిసారి బెంగళూరు బుల్స్తో తలపడిన టైటాన్స్ హోరాహోరీ పోరులో ఓటమి పాలైంది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడటంతో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది.
బెంగళూరు తరఫున రోహిత్ కుమార్ (8), పవన్ షెరావత్ (6), అమిత్ షెరాన్ (5) సత్తా చాటారు. మ్యాచ్ మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా... ఇరు జట్లు 25-25తో సమంగా నిలిచాయి. ఈ దశలో స్టార్ రైడర్ రాహుల్ చౌదరిని ప్రత్యర్థి జట్టు పట్టేయడంతో టైటాన్స్ ఆలౌటైంది. టైటాన్స్ తరఫున రాహుల్ చౌదరి, విశాల్ భరద్వాజ్ చెరో 6 పాయింట్లు సాధించారు.
12 మ్యాచ్ల నుంచి 32 పాయింట్లు సంపాదించిన టైటాన్స్ జోన్-బిలో నాలుగో స్థానంలో ఉంది. హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్లో పుణెరి పల్టన్ 35-33తో హరియాణా స్టీలర్స్పై పోరాడి నెగ్గింది. విరామానికి 8-23తో వెనుకబడి ఉన్న పుణెరి.. ద్వితీయార్ధంలో అద్భుతంగా పుంజుకుంది.
పుణెరి తరఫున సందీప్ నర్వాల్ అత్యధికంగా ఏడు పాయింట్లు సాధించాడు. మోను గోయత్ (11) గొప్పగా ఆడినా హరియాణాకు ఓటమి తప్పలేదు. గురువారం జరగనున్న మ్యాచ్లలో పుణేరి పల్టన్స్తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్, బెంగళూరు బుల్స్తో బెంగాల్ వారియర్స్ తలపడనున్నాయి.