హైదరాబాద్: ప్రో కబడ్డీ లీగ్లో భాగంగా బుధవారం రాత్రి యుపి యోధాతో జరిగిన మ్యాచ్లో తమిళ్ తలైవాస్ అద్భుత ప్రదర్శన చేసింది. తొలి అర్ధ భాగంలో యుపి పైచేయి ప్రదర్శిస్తే, రెండో అర్ధభాగంలో తమిళ్ తలైవాస్ అనూహ్యంగా పుంజుకుంది. దీంతో ఇరు జట్ల మధ్య మ్యాచ్ 33-33తో టై అయింది.
ఆరంభం నుంచే రెండు జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. అయితే చివరి నిమిషంలో మూడు రైడ్లు ఆట స్వరూపాన్నే మార్చివేశాయి. అప్పటివరకు గెలుపు ధీమాతో ఉన్న యుపి యోధా మ్యాచ్ టైగా ముగియడంతో నివ్వెరపోయింది. చివర్లో యుపి యోధా 33-32తో ఆధిక్యంలో ఉన్నా యోధా రైడర్ను తలైవాస్ డిఫెండర్లు పట్టేయడంతో స్కోరు సమమైంది.

తమిళ జట్టులో అజయ్ ఠాకూర్ విజృంభించి పది పాయింట్లు స్కోరు చేయగా అమిత్ హుడా (6), దర్శన్ (4), వినీత్ కుమార్ (3) రాణించారు. యుపిలో రిషాంక్ ఏకంగా 16 పాయింట్లు రాబట్టినా మిగతా వారి నుంచి పెద్దగా సహకారం లభించలేదు. నితిన్ తోమర్ (4), జీవన్ కుమార్ (3) పాయింట్లతో రాణించారు.
ఢిల్లీపై హర్యానా స్టీలెర్స్ విజయం
బుధవారం జరిగిన మరో మ్యాచ్లో హర్యానా స్టీలెర్స్ దబాంగ్ ఢిల్లీపై రెండు పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో చెలరేగి 27-25 తేడాతో ఢిల్లీపై చివరి వరకు పోరాడి విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభంలో వెనుకబడిన ఢిల్లీ ఆ తర్వాత పుంజుకున్న తీరు అద్భుతం. చివరి నిమిషంలో ఢిల్లీ ఆటగాళ్లు పాయింట్ల రాబట్టడంలో విఫలమవడంతో ఓటమి పాలైంది.