హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్లో గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుస విజయాలతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తోంది. మంగళవారం పుణేరి పల్టన్తో జరిగిన మ్యాచ్లో 35-21 తేడాతో ఘనవిజయం సాధించింది.
ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్ల్లో కేవలం ఒక్క మ్యాచ్లోనే ఓడిన ఈ జట్టుకిది ఏడో విజయం కాగా రెండు 'టై'గా ముగిశాయి. తద్వారా గుజరాత్ 41 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ డిఫెండర్ ఫజెల్ అత్రాచలి తొమ్మిది పాయింట్లతో ప్రత్యర్థికి అడ్డుగోడగా నిలిచాడు.

మరోవైపు కెప్టెన్ సుఖేశ్ హెగ్డే (5), సచిన్ (4), మిఘాని (4) పాయింట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ప్రారంభం నుంచే పుణేరిపై ఎదురుదాడికి దిగిన గుజరాత్ తొలి అర్ధభాగంలో 16-7తో స్పష్టమైన ఆధిక్యం పొందింది. రెండో అర్ధభాగంలో కూడా గుజరాత్ అదే దూకుడుని ప్రదర్శించింది.
ఇక, పుణెరి ఆటగాళ్లు దీపక్ హుడా (5), సందీప్ నర్వాల్ (4), గిరీష్ (4) తప్ప మిగతా వారంతా చేతులెత్తేశారు. డిఫెన్స్లో పటిష్టంగా ఉన్న గుజరాత్ 17 టాకిల్ పాయింట్స్ రాబట్టింది. పుణెరి 10 పాయింట్లకే పరిమితమైంది. గుజరాత్ 13 రైడింగ్ పాయింట్లు నమోదు చేయగా.. పల్టన్ 11 సాధించింది. అయితే, రెండు సార్లు ఆలౌటై మూల్యం చెల్లించుకుంది.
ప్రో కబడ్డీ లీగ్లో బుధవారం జరిగే మ్యాచ్ల్లో హర్యానా స్టీలర్స్తో దబంగ్ ఢిల్లీ, తెలుగు టైటాన్స్తో యూపీ యోధ తలపడనున్నాయి.