హైదరాబాద్: ప్రొ కబడ్డీ ఐదో సీజన్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ దుమ్మురేపుతోంది. ముఖ్యంగా సొంతగడ్డపై చెలరేగి ఆడుతోంది. మంగళవారం జరిగిన మ్యాచ్లో బెంగళూరు బుల్స్ను 27-24తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ సీజన్లో గుజరాత్కి ఇది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం.
మ్యాచ్లో ఎక్కువ శాతం బెంగళూరు బుల్స్ ఆధిక్యంలో కొనసాగినప్పటికీ ఒత్తిడికి గురై మ్యాచ్ని చేజార్చుకుంది. ఆరంభం నుంచే బెంగళూరు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దీంతో తొలి అర్ధభాగాన్ని 14-10తో ముగించింది. అయితే రెండో అర్ధభాగంలో గుజరాత్ అనూహ్యంగా పుంజుకుంది.

రెండో అర్ధభాగంలో సుఖేష్ను బెంగళూరు డిఫెన్స్ పట్టేయడంతో 19-10తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ దశలో మ్యాచ్ మలుపు తిరిగింది. గుజరాత్ రైడర్లు రెచ్చిపోయి వరుసగా పాయింట్లు సాధించగా బెంగళూరు రైడర్లు డీలా పడిపోయారు. రెండో అర్ధభాగంలో 11 నిమిషాలు ముగిసే సరికి 21-21తో గుజరాత్ స్కోరు సమం చేసింది.
స్కోరు 24-24తో ఉన్న దశలో వరుసగా మూడు పాయింట్లు సాధించిన ఫార్చూన్ మ్యాచ్లో విజయం సాధించింది. టాకిల్లో పర్వేశ్ 4 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. టాకిల్ చేసిన నాలుగు సార్లు పాయింట్లు తెచ్చిపెట్టాడు. రైడింగ్లో సచిన్ 4, రోహిత్ గులియా 4, సునీల్ కుమార్ 3 పాయింట్లతో రాణించారు.
బుధవారం జరిగే మ్యాచ్ల్లో హర్యానా స్టీలర్స్తో తమిళ్ తలైవాస్, గుజరాత్ జెయింట్స్తో తెలుగు టైటాన్స్ తలపడతాయి. ఈ మ్యాచ్లను 'స్టార్ స్పోర్ట్స్-2' ఛానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.