హైదరాబాద్: ప్రో కబడ్డీ లీగ్లో తొలిసారిగా బరిలో దిగిన గుజరాత్ ఫార్చున్ గెయింట్స్ జట్టు మొదటి మ్యాచ్లోనే శుభారంభం చేసింది. మంగళవారం గచ్చిబౌలి వేదికగా జరిగిన మ్యాచ్లో గుజరాత్ జట్టు ఆల్రౌండ్ ప్రతిభతో ఆకట్టుకుంది. 26-20తో టోర్నీ ఫేవరెట్ దబాంగ్ ఢిల్లీపై విజయం సాధించింది.
ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ సుకేశ్ హెగ్డే అనుభవం గుజరాత్కు ఎంతో లాభించింది. గుజరాత్ జట్టులోని డిఫెండర్ ఫాజెల్ అట్రాచాలి ప్రత్యర్థి జట్టులోని రైడర్స్ను దీటుగా నిలువరించడంతోపాటు 4పాయింట్లను సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

తొలి అర్ధభాగం ముగిసేసరికి గుజరాత్ 15-5తో ఆధిక్యం సంపాదించింది. ఒకానొక దశలో ప్రత్యర్థిపై 17 పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో అర్ధభాగంలో 15 పాయింట్లు సాధించిన ఢిల్లీ జట్టు కాస్త ప్రతిఘటించింది. మిరాజ్ షేక్ స్థానంలో సబ్స్టిట్యూట్గా అడుగుపెట్టిన శ్రీరామ్.. ఢిల్లీకి అండగా నిలిచాడు.
ఏకపక్షంగా సాగుతున్న మ్యాచ్ను శ్రీరామ్ (5) తన దూకుడుతో ఆసక్తికరంగా మార్చాడు. రైడ్కు వెళ్ళిన ప్రతిసారి పాయింటు గెల్చుకుంటూ గుజరాత్ ఆధిక్యాన్ని తగ్గించాడు. ఆనంద్ పాటిల్ (3) కూడా మెరవడంతో ఢిల్లీ వరుసగా పాయింట్లు సాధించింది.
ఈ సమయంలో వ్యూహంతో ఆడిన గుజరాత్ జట్టు మాత్రం వారికి గెలిచే అవకాశాన్నివ్వలేదు. రెండో అర్ధభాగంలో గుజరాత్ (11) కంటే ఢిల్లీ (15) ఎక్కువ పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్లో ఇరుజట్లు ఒక్కోసారి ఆలౌటయ్యాయి. గుజరాత్ జట్టు రైడర్ సచిన్ 4 పాయింట్లతో మెరువగా.. ఢిల్లీ జట్టులో శ్రీరామ్ 5 పాయింట్లు సాధించాడు.