
హైదరాబాద్: ప్రొ కబడ్డీ ఆరు సీజన్లకు ముహూర్తం ఖరారైంది. ఈ ఏడాది అక్టోబర్ 19న ప్రారంభమవుతుందని నిర్వాహకులు వెల్లడించారు. ఐదో సీజన్లాగే ఆరో సీజన్ పోటీలను కూడా 13 వారాలపాటు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే ఆరో సీజన్తో పాటు ఏడో సీజన్కు సంబంధించిన తేదీలను కూడా ప్రొకబడ్డీ నిర్వాహక సంస్థ మాషల్ స్పోర్ట్స్ గురువారం ప్రకటించింది. వచ్చే ఏడాది జూలై 19న ప్రారంభమయ్యే ఏడో సీజన్ను కూడా 13 వారాలపాటు నిర్వహించనున్నారు.
ఐదో సీజన్లో పోటీపడే జట్లను 8 నుంచి 12కు పెంచి 138 మ్యాచ్లను నిర్వహించనున్నారు. ఆసియా క్రీడలు జరగనున్న నేపథ్యంలో ఆరో సీజన్ను అక్టోబరులో నిర్వహించాలని నిర్ణయించినట్లు లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి చెప్పారు.
కాగా గత సీజన్లో ప్రదీప్ నర్వాల్ నేతృత్వంలోని పాట్నా పైరేట్స్ ఫైనల్లో గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్ను ఓడించి వరుసగా మూడోసారి టైటిల్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఐదో సీజన్ అభిమానులను ఎంతగానో అలరించిందని, ఆరు, ఏడు సీజన్లు కూడా అదే విధంగా అభిమానులను అలరిస్తాయని అన్నారు. ఆరో సీజన్కు సంబంధించిన అన్ని మ్యాచ్లను అభిమానులు స్టార్స్ స్పోర్ట్స్ నెట్ వర్క్తో పాటు హాట్ స్టార్లో వీక్షించొచ్చని ఆయన తెలిపారు.
అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్ అధ్యక్షుడు జనార్థన్ సింగ్ గెహ్లాట్ మాట్లాడుతూ ప్రో కబడ్డీ లీగ్ భారత అభిమానులకు కబడ్డీని మరింత చేరువ చేసిందని అన్నారు. ఈ సుదీర్ఘమైన టోర్నీ రాబోయే రోజుల్లో మరింత ఎత్తుకు ఎదగాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన అన్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.