నోయిడా: ప్రొకబడ్డీ లీగ్ ఏడో సీజన్లో తెలుగు టైటాన్స్ ఆటతీరు మారట్లేదు. ఇప్పటికే వరుస ఓటములతో సతమతమవుతున్న టైటాన్స్ మరో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న టైటాన్స్ తాజాగా పరాజయాల హ్యాట్రిక్ను నమోదు చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 38-48తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ చేతిలో ఓడిపోయింది. టైటాన్స్ రైడర్ సిద్దార్థ్ దేశాయ్ 13 పాయింట్లు చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. గుజరాత్ తరుపున రైడర్లు సోను (17 పాయింట్లు), రోహిత్ గులియా (9 పాయింట్లు) రాణించారు.
మ్యాచ్ ఆరంభం నుంచి తెలుగు టైటాన్స్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఏడో నిమిషంలోనే గుజరాత్ను ఆలౌట్ చేసి 12-5తో టైటాన్స్ ఆధిక్యంలోకి వెళ్ళింది. ఇదే ఊపులో తొలి అర్ధ భాగం ముగిసే సరికి 21-13తో నిలిచింది. అయితే రెండో అర్ధ భాగంలో గుజరాత్ ఒక్కసారిగా పుంజుకుంది. గుజరాత్ రైడర్ సోనూ రెచ్చిపోయి వరుస పాయింట్లు సాధించాడు. దీంతో ద్వితీయార్ధం రెండో నిమిషంలోనే టైటాన్స్ ఆలౌట్ కాగా.. ఆధిక్యం 22-19కి తగ్గిపోయింది.
సోను, రోహిత్ వరుసగా విరుచుకుపడడంతో 32వ నిమిషంలో మరోసారి ఆలౌటైన తెలుగు టైటాన్స్ 30-32తో వెనుకబడింది. గుజరాత్ మ్యాచ్ చివరి వరకు ఇదే ఆధిక్యాన్ని కొనసాగించింది. టైటాన్స్ పుంజుకునే ప్రయత్నం చేసినా.. పరాజయం తప్పలేదు. టైటాన్స్కు సీజన్లో ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉండగా.. విజయం సాధించి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఉన్న స్థానాన్ని కాపాడుకుంటుందో లేక చిట్ట చివరి స్థానానికి పడిపోతుందో చూడాలి.
సోమవారం జరిగిన మరో మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 35-33తో జైపూర్ పింక్ పాంథర్స్పై నెగ్గింది. అజిత్ కుమార్ సూపర్-10తో జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ సీజన్ను గ్రాండ్గా ఆరంభించిన జైపూర్ ఓటమితో వీడ్కోలు పలికింది. నేడు ప్రొ కబడ్డీ లీగ్లో విశ్రాంతి దినం. బుధవారం జరిగే మ్యాచ్ల్లో బెంగాల్ వారియర్స్తో తమిళ్ తలైవాస్.. యూపీ యోధతో తెలుగు టైటాన్స్ తలపడతాయి.