జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7లో తెలుగు టైటాన్స్ రాత మారట్లేదు. పేలవ ప్రదర్శన కనబరుస్తున్న టైటాన్స్ పదో పరాజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 39-40తో బెంగాల్ వారియర్స్ చేతిలో చివరి వరకు పోరాడి ఓడింది. కబడ్డీ బాహుబలి సిద్ధార్థ్ దేశాయ్ (15పాయింట్లు) చివరి వరకు రైడింగ్లో రాణించినా.. టైటాన్స్కు ఓటమి తప్పలేదు. అతడికి తోడుగా ట్యాక్లింగ్లో కెప్టెన్ మోహజెర్ మిఘాని హైఫై (5 పాయింట్లు)తో చెలరేగినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు బెంగాల్ స్టార్ రైడర్ మణిందర్ సింగ్ (17పాయింట్లు) మ్యాచ్ ఆసాంతం అదరగొట్టాడు. తాజా విజయంతో బెంగాల్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి దూసుకెళ్లింది.
ఒక రోజు ఆలస్యంగా బీసీసీఐ ఎన్నికలు.. ఎందుకంటే?
మ్యాచ్ ప్రారంభం నుంచే ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. రైడర్లు చెలరేగడంతో టైటాన్స్, బెంగాల్ జట్ల పాయింట్లు సమం అవుతూ వచ్చాయి. ఒక్కసారిగా పుంజుకున్న బెంగాల్ వరుసగా పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. ఓ దశలో వారియర్ ప్లేయర్ మణిందర్ అద్భుత రైడ్ చేశాడు. ఇద్దరు తెలుగు జట్టు డిఫెండర్లను పట్టేసి ఆలౌట్ చేశాడు. దీంతో టైటాన్స్ 9-16తో వెనుకబడిపోయింది. అదే ఊపులో తొలి అర్ధభాగం ముగిసే సరికి 19-13తో బెంగాల్ ముందంజలో నిలిచింది.
రెండో అర్ధభాగంలో సిద్ధార్థ్ దేశాయ్ వరుస పాయింట్లు సాధించడంతో తెలుగు టైటాన్స్ ఓ దశలో 25-22తో ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. ఈ సమయంలో బెంగాల్ను రైడింగ్తో ఆదుకున్న మణీందర్.. మళ్లీ గెలుపుబాట పట్టించాడు. ఇక మ్యాచ్ ముగిసే ఆరు నిమిషాల ముందు టైటాన్స్ ఆలౌటై వెనుకంజలో పడింది. అయితే చివరలో మ్యాచ్ థ్రిల్లింగ్కు గురిచేసినా.. టైటాన్స్ ఒక్క పాయింట్ తేడాతో ఓడిపోయింది. తాజా ఓటమితో టైటాన్స్ ప్లే ఆఫ్ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది.
బుధవారం జరిగిన మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 43-34తో పుణేరి పల్టన్పై గెలుపొందింది. జైపూర్ స్టార్ రైడర్ దీపక్ హుడా సూపర్ 'టెన్' (12 పాయింట్లు)తో రాణించగా.. దీపక్ నర్వాల్ (11 పాయింట్లు) సత్తా చాటాడు. మ్యాచ్ ఆసాంతం జైపూర్ సత్తా చాటింది. పల్టన్ను ఆలౌట్ చేస్తూ తొలి అర్ధభాగాన్ని 20-13తో ముగించింది. అయితే రెండో అర్ధభాగంలో పుంజుకున్న పల్టన్.. ఓ దశలో 23-21తో నిలిచింది. ఆ తర్వాత జైపూర్ రైడర్ దీపక్ రాణించడంతో భారీ ఆధిక్యంలోకి వెళ్ళింది. అదే ఊపులో మ్యాచును సొంతం చేసుకుంది. గురువారం జరిగే మ్యాచ్లో పట్నా పైరేట్స్తో దబంగ్ ఢిల్లీ తలపడుతుంది.