
పుణె: స్టార్ రైడర్, కెప్టెన్ మణిందర్ సింగ్ రైడింగ్లో (18 పాయింట్లు) మెరవడంతో బెంగాల్ వారియర్స్ వరుసగా నాలుగో విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రొ కబడ్డీ లీగ్-7లో గురువారం జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 48-36తో హర్యానా స్టీలర్స్ను ఓడించింది. ఈ విజయంతో లీగ్లో బెంగాల్ వారియర్స్ పదో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.మణిందర్తో పాటు రైడింగ్లో ప్రపంజన్ (7 పాయింట్లు) ఆకట్టుకోగా.. ట్యాక్లింగ్లో బల్దేవ్ సింగ్ (6 పాయింట్లు) హై ఫై సాధించాడు.హర్యానా తరఫున వినయ్ (14 పాయింట్లు), వికాస్ కండోలా (9 పాయింట్లు) రైడింగ్లో రాణించినా.. డిఫెన్స్లో విఫలమయి మూల్యం చెల్లించుకుంది.
మ్యాచ్ ఆరంభం నుండే మణిందర్ సింగ్ హవా మొదలైంది. మరోవైపు బల్దేవ్ సింగ్ అతడికి తోడవ్వడంతో తొలి ఆరు నిమిషాల్లోనే హర్యానా ఆలౌట్ అయింది. దీంతో 10-3 ఆధిక్యంలోకి వెళ్ళింది. బెంగాల్ మరింత రెచ్చిపోవడంతో 30-14తో తొలి అర్ధ భాగాన్ని ముగించింది. 16 పాయింట్ల ఆధిక్యంలో వెనుకబడ్డ హర్యానా.. వినయ్, వికాస్ రాణించడంతో విరామం అనంతరం పుంజుకుంది. బెంగాల్ స్కోరును సమీపించే ప్రయత్నం చేసింది.
ఈ దశలో మణిందర్, ప్రపంజన్ దూకుడుగా ఆడడంతో బెంగాల్ దూసుకుపోయింది. అదే ఊపులో చివరికి 12 పాయింట్ల ఆధిక్యంతో మ్యాచును ముగింసింది. మ్యాచ్ తొలి అర్ధభాగంలోనే రెండు సార్లు ఆలౌటైన హర్యానా.. తిరిగి కోలుకోలేకపోయింది. రైడింగ్లో ఇరు జట్లు సమానంగానే నిలిచినా.. ట్యాక్లింగ్లో బెంగాల్ ముందంజలో నిలిచింది. ఈ రోజు తెలుగు టైటాన్స్-పాట్నా పైరేట్స్, పుణేరి పల్టాన్-బెంగళూరు బుల్స్ జట్లు తలపడనున్నాయి.