
జైపూర్: స్టార్ రైడర్ మణిందర్ సింగ్ (19పాయింట్లు) విజృంభించడంతో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో బెంగాల్ వారియర్స్ కేవలం ఒక్క పాయింట్ తేడాతో జైపూర్ పింక్పాంథర్స్ను ఓడించింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో బెంగాల్ 41-40తో ఆతిథ్య జైపూర్ జట్టును మట్టికరిపించింది. ఈ విజయంతో ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసి.. ఢిల్లీ తర్వాత ప్లేఆఫ్స్ బెర్త్ దక్కించుకున్న రెండో జట్టుగా బెంగాల్ నిలిచింది.
మ్యాచ్ ప్రారంభం నుంచి రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఆధిక్యం మారుతూ వచ్చినా.. తొలి అర్ధభాగం ముగిసే సరికి జైపూర్ 14-13తో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. విరామం అనంతరం ప్రపంజన్ సూపర్ రైడ్తో అదరగొట్టడంతో జైపూర్ ఆలౌటైవడంతో బెంగాల్ ఆధిక్యం 20-14కు పెరిగింది. అదే ఊపులో 36-26తో బెంగాల్ మ్యాచ్ను సులువుగానే గెలుస్తుందనుకునే సయయంలో నీలేశ్ సొలంకి సహా జైపూర్ రైడర్లు వరుసగా పాయింట్లు సాధిస్తూ.. 39-41తో బెంగాల్ ఆధిక్యాన్ని తగ్గించేశారు. చివరి నిమిషంలో ఉత్కంఠ నెలకొన్న సమయంలో నీలేశ్ ఓ పాయింట్ సాధించినా.. జైపూర్ ఓటమిని తప్పించుకోలేకపోయింది. బెంగాల్ తరపున మణిందర్ (19పాయింట్లు).. జైపూర్ తరపున నీలేశ్ సొలంకి (15 పాయింట్లు) సూపర్-10 సాధించారు.
ఆదివారం జరిగిన మరో మ్యాచ్లో యు ముంబా 31-25తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ను ఓడించింది. ఈ విజయంతో ప్రొ కబడ్డీ లీగ్లో ముంబా జట్టు తొమ్మిదో విజయం సాధించింది. రైడర్ అభిషేక్ సింగ్ 11 పాయింట్లతో రాణించడంతో ముంబా సునాయాస విజయాన్ని అందుకుంది. రైడింగ్లో ఇరు జట్లు చెలరేగినా.. ట్యాక్లింగ్లో అదరగొట్టిన ముంబా గెలుపును దక్కించుకుంది. నేటి మ్యాచ్ల్లో పట్నా పైరేట్స్తో హరియాణా స్టీలర్స్; దబంగ్ ఢిల్లీతో బెంగళూరు బుల్స్ తలపడతాయి.