కబడ్డీ కూతకు వేళైంది. కార్పొరేట్ హంగులు అద్దుకున్న భారత దేశ పల్లే క్రీడ కబడ్డీ మళ్లీ అలరించేందుకు సిద్దమైంది. 10 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ప్రోకబడ్డీ లీగ్ 11వ సీజన్ నేటి నుంచే ప్రారంభం కానుంది. మొదటి దశ మ్యాచ్లకు గచ్చిబౌలి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రారంభ మ్యాచ్లో తెలుగు టైటాన్స్- బెంగళూరు బుల్స్ తలపడనున్నాయి. రాత్రి 8 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది.
లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి తెలుగు టైటాన్స్ ఫేవరేట్గానే బరిలోకి దిగుతుంది. కానీ టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. రెండో సీజన్లో మూడో స్థానంలో నిలవడమే టైటాన్స్ అత్యుత్తమ ప్రదర్శన. ఇటీవల తెలుగు టైటాన్స్ జట్టు ప్రదర్శన మరింత పేలవంగా కొనసాగుతోంది. గత మూడు సీజన్లలో పాయింట్ల పట్టికలో అట్టడుగన 12వ స్థానంలో నిలిచింది. ఈ సీజన్లోనైనా టైటాన్ రాత మారుతుందేమో చూడాలి.

ఇవాళ జరగనున్న మరో మ్యాచ్లో రాత్రి 9 గంటలకు దబంగ్ దిల్లీతో యు ముంబా పోటీపడనంది. ఈ సారి ప్రోకబడ్డీ లీగ్ను మూడు నగరాలకు మాత్రమే పరిమితం చేశారు. అక్టోబర్ 19 నుంచి నవంబర్ 9 వరకు హైదరాబాద్, గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మ్యాచ్లు జరగనున్నాయి. నోయిడాలో నవంబర్ 10 నుంచి డిసెంబర్ 1 వరకు, పుణే వేదికగా డిసెంబర్ 3 నుంచి 24 వరకు కబడ్డీ మ్యాచ్లు నిర్వహించనున్నారు.
కాగా, ఈ సీజన్కు సంబంధించిన వేలంలో స్టార్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు రూ. కోట్లు కురిపించాయి. లీగ్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఈసారి 8 మంది కబడ్డీ ఆటగాళ్లు కోట్లు పలికారు. సచిన్ తన్వర్ భారీ ధర పలికాడు. అతన్ని తమిళ్ తలైవాస్ రూ.2.15 కోట్లకు సొంతం చేసుకుంది.
లైవ్ ఎలా చూడాలంటే?
ప్రోకబడ్డీ లీగ్కు స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్స్టార్ అధికారిక బ్రాడ్కాస్టర్గా వ్యవహరిస్తున్నాయి. స్టార్ స్పోర్ట్స్-1, స్టార్ స్పోర్ట్స్-2, ఆయా హెచ్డీ శాటిలైట్ ఛానెల్ల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు. అయితే ఈ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఓటీటీ ఫ్లాట్ఫామ్ హాట్ స్టార్లో మాత్రం ఫ్రీగా ఈ సిరీస్ను వీక్షించవచ్చు.