ప్రోకబడ్డీ లీగ్ సీజన్-11లో తెలుగు టైటాన్స్ అదిరే ప్రదర్శన చేస్తోంది. విజయాల్లో మరో హ్యాట్రిక్ సాధించింది. నొయిడా వేదికగా గురువారం బెంగాల్ వారియర్స్తో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్లో 31-29 పాయింట్లతో నెగ్గింది. మొత్తంగా ఈ సీజన్లో ఆడిన 12 మ్యాచ్ల్లో ఎనిమిదింట్లో గెలిచి 42 పాయింట్లతో టేబుల్లో రెండో స్థానానికి ఎగబాకింది. హర్యానా స్టీలర్స్ 9 విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది.
మ్యాచ్ ఆరంభం నుంచే తెలుగు టైటాన్స్ దూకుడు ప్రదర్శించింది. బెంగాల్ వారియర్స్ను ఒకసారి ఆలౌట్ చేసి తొలి అర్ధభాగంలో 19-9 తేడాతో భారీ ఆధిక్యాన్ని సాధించింది. అయితే సెకండ్ హాఫ్లో టైటాన్స్ అదే జోరును ప్రదర్శించలేకపోయింది. ప్రత్యర్థి రైడర్ల ముందు నిలవలేక ఒకసారి ఆలౌట్ అయ్యింది. కానీ ఫస్టాఫ్లో ఉన్న ఆధిక్యంతో అంతిమంగా మ్యాచ్ను సొంతం చేసుకుంది.

తెలుగు టైటాన్స్లో స్టాండ్బై కెప్టెన్ విజయ్ మాలిక్ 14 పాయింట్లతో సత్తాచాటాడు. గాయంతో పవన్ సెహ్రావత్ గత మూడు మ్యాచ్లకు దూరమైన విషయం తెలిసిందే. బెంగాల్ వారియర్స్ జట్టులో ప్రణయ్ రాణే 9 పాయింట్లు సాధించాడు. కాగా, నొయిడా వేదికగా గురువారం జరిగిన మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్పై హర్యానా స్టీలర్స్ 32-26తో విజయం సాధించింది.
ఆరంభం నుంచే బెంగళూరుపై హర్యానా ఆధిప్యతం చెలాయించింది. ఫస్టాఫ్ను 21-12తో ముగించింది. సెకండ్ హాఫ్లో బెంగళూరు పుంజుకున్నప్పటికీ, వాళ్ల పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది. హర్యానా స్టీలర్స్లో వినయ్ రైడర్ 12 పాయింట్లు సాధించాడు. బెంగళూరు బుల్స్లో అక్షిత్ (7 పాయింట్లు) టాప్ స్కోరర్. కాగా, నొయిడా వేదికగా శుక్రవారం రాత్రి 8 గంటలకు తమిళ్ తలైవాస్ వర్సెస్ యూపీ యోధాస్, రాత్రి 9 గంటలకు జైపుర్ పింక్ పాంథర్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ మ్యాచ్లు జరగనున్నాయి.