ప్రో కబడ్డీ లీగ్ సీజన్-11లో తెలుగు టైటాన్స్ మరో పరాజయాన్ని చవిచూసింది. గురువారం పుణె వేదికగా దబాంగ్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో 33-27 పాయింట్లతో ఓటమిపాలైంది. గత అయిదు మ్యాచ్ల్లో టైటాన్స్కు ఇది నాలుగో ఓటమి. ఈ సీజన్లో ఇప్పటివరకు 19 మ్యాచ్లు ఆడిన టైటాన్స్ 10 మ్యాచ్ల్లో గెలిచి, తొమ్మిదింట్లో ఓడింది. పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది.
అయితే తొలి అర్ధభాగంలో దబాంగ్ ఢిల్లీపై తెలుగు టైటాన్స్ పైచేయి సాధించింది. ఢిల్లీని ఒక్కసారి ఆలౌట్ చేసి 17-13 పాయింట్లతో ఆధిక్యంలో నిలిచింది. కానీ రెండో అర్ధభాగంలో నిరాశపర్చింది. ప్రత్యర్థి చేతిలో రెండు సార్లు ఆలౌటైంది. ఢిల్లీ సాధించిన 20 పాయింట్లతో సగం పాయింట్లతోనే సరిపెట్టుకుని మ్యాచ్ను దూరం చేసుకుంది. దబాంగ్ ఢిల్లీలో నవీన్ కుమార్ 11 పాయింట్లు, కెప్టెన్ అషు మాలిక్ 9 పాయింట్లతో రాణించారు.

తెలుగు టైటాన్స్లో విజయ్ మాలిక్ 10 పాయింట్లు, ఆశిష్ నర్వాల్ 8 పాయింట్లతో పోరాడారు. గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన కెప్టెన్ పవన్ సెహ్రావత్ మూడు పాయింట్లు సాధించాడు. కాగా, పుణె వేదికగా గురువారం జరిగిన మరో మ్యాచ్ 'టై' అయ్యింది. యూపీ యోధాస్ - బెంగాల్ వారియర్స్ 31-31 పాయింట్లతో సమంగా నిలిచాయి. తొలి అర్ధభాగంలో బెంగాల్పై యూపీ 15-13తో ఆధిక్యంలో నిలిచింది. కానీ సెకండ్ హాఫ్లో బెంగాల్ పుంజుకుని మ్యాచ్ను టైగా ముగించింది.
యూపీ యోధాస్లో గగన్ గౌడ 11, భవాని రాజ్పుత్ 8 పాయింట్లు సాధించారు. బెంగాల్ వారియర్స్లో ప్రణయ్ రానే 10 పాయింట్లతో రాణించాడు. కాగా, ఇవాళ పుణె వేదికగా రాత్రి 8 గంటలకు తమిళ్ తలైవాస్తో పట్నా పైరేట్స్, రాత్రి 9 గంటలకు పుణెరి పల్టాన్తో బెంగళూరు బుల్స్ తలపడనున్నాయి.