ప్రోకబడ్డీ లీగ్ సీజన్-11లో తెలుగు టైటాన్స్ సత్తాచాటుతోంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన హర్యానా స్టీలర్స్ను మట్టికరిపించింది. నొయిడా వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్లో హర్యానాను 49-27తో చిత్తుగా ఓడించింది. గత మ్యాచ్లో ఓటమిపాలైన టైటాన్స్.. తిరిగి అదిరేలా గెలుపు బాట పట్టి ఏడో స్థానంలో కొనసాగుతోంది.
మ్యాచ్ ఆరంభం నుంచి తెలుగు టైటాన్స్ దుమ్మురేపింది. రైడింగ్, ట్యాకిల్లో పోటాపోటీగా పాయింట్లు సాధించింది. హర్యానాను రెండు సార్లు ఆలౌట్ చేసింది. 24-11తో తొలి అర్ధభాగంలో భారీ ఆధిక్యాన్ని సాధించింది. రెండో అర్ధభాగంలోనే అదే జోరు కొనసాగించింది. మరో రెండు ప్రత్యర్థిని కుప్పకూల్చింది. హర్యానా జట్టులో ఢిఫెండర్లు సత్తాచాటలేకపోయారు.

తెలుగు టైటాన్స్ జట్టులో ఆశిష్ నర్వాల్ 11 పాయింట్లు, విజయ్ మాలిక్ 8 పాయింట్లతో సత్తాచాటాడు. గాయం కారణంగా టైటాన్స్ కెప్టెన్ పవన్ సెహ్రావత్ ఈ మ్యాచ్లో బరిలోకి దిగలేదు. విజయ్ సారథి బాధ్యతలు చూసుకున్నాడు. హర్యానా జట్టులో కెప్టెన్ రాహుల్ (6 పాయింట్లు) టాప్ స్కోరర్. నొయిడా వేదికగా జరిగిన మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్పై యు ముంబా 38-37తో విజయం సాధించింది.
ఆది నుంచే మ్యాచ్ హోరాహోరీగా సాగింది. అయితే బెంగళూరును ఆలౌట్ చేసిన ముంబా ఒక్క పాయింట్ ఆధిక్యంతో 21-20 తొలి అర్ధభాగాన్ని ముగించింది. సెకండ్ హాఫ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఇరు జట్లు సెకండ్ హాఫ్లో 17-17తో సమంగా పాయింట్లు సాధించాయి. ఫస్ట్ హాఫ్లోని ఆధిక్యంతో యు ముంబా విజయతీరాలకు చేరింది.
అజిత్ చౌహాన్ 10 పాయింట్లు, మంజీత్ రైడర్ 9 పాయింట్లతో విజయంలో కీలకపాత్ర పోషించారు. బెంగళూరు బుల్స్లో ప్రదీన్ నర్వాల్ 10 పాయింట్లతో పోరాడాడు. కాగా, నొయిడా వేదికగా ఇవాళ రాత్రి 8 గంటలకు పుణెరి పల్టాన్తో యూపీ యోధాస్, రాత్రి 9 గంటలకు బెంగళూరు బుల్స్తో పట్నా పైరేట్స్ తలపడనున్నాయి.