ప్రోకబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) సీజన్ 11లో తమిళ్ తలైవాస్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో పుణెరి పల్టాన్తో బుధవారం జరిగిన మ్యాచ్లో తలైవాస్ 35-30తో నెగ్గింది. రైడర్లు నరేందర్ కండోలా (9 పాయింట్లు), సచిన్ (8), డిఫెండర్ నితేశ్ కుమార్ (5) సత్తాచాటి విజయంలో కీలక పాత్ర పోషించారు.
మరోవైపు పుణెరి పల్టాన్లో రైడర్ మోహిత్ 13 పాయింట్లతో పోరాడాడు. ఆది నుంచే తమిళ్ తలైవాస్ ఆధిపత్యం చెలాయించింది. రైడింగ్, ట్యాక్లింగ్లో సత్తాచాటుతూ తొలి అర్ధభాగాన్ని 19-15తో ముగించింది. అదే జోరును రెండో అర్ధభాగంలోనూ కొనసాగించింది. మ్యాచ్లో ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్ చేసి సత్తాచాటింది. అయితే సెకండ్ హాఫ్లో పుణెరి జట్టుతో పోలిస్తే తలైవాస్ డిఫెండింగ్లో కాస్త నిరాశపర్చింది.

గచ్చిబౌలి వేదికగానే బుధవారం జరిగిన మరో మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్పై యు ముంబా 33-27 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో యు ముంబాకు ఇది తొలి విజయం కాగా, గుజరాత్ జెయింట్స్కు మొదటి ఓటమి. కాగా, ముంబా విజయంలో ఆల్రౌండర్ అమిర్ మహమ్మద్ పది పాయింట్లతో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్, డిఫెండర్ సునీల్ కుమార్ మూడు పాయింట్లు సాధించాడు.

గుజరాత్ జెయింట్స్లో డిఫెండర్ సోంబిర్, రైడర్ పార్తిక్ దాహియా చెరో అయిదు పాయింట్లు సాధించారు. ఫస్ట్ హాఫ్లో యు ముంబా, గుజరాత్ హోరాహోరీగా పోటీపడ్డాయి. ఒక్క పాయింట్ ఆధిక్యంతో ముంబా 14-13తో తొలి అర్ధభాగాన్ని ముగించింది. సెకండ్ హాఫ్లో యు ముంబాకు గుజరాత్ గట్టిపోటీని ఇవ్వలేకపోయింది. ఒక్కసారి ఆలౌటవ్వడంతో పాటు పాయింట్లను ధారాళంగా సమర్పించుకుంది.