ప్రోకబడ్డీ లీగ్ సీజన్-11లో తమిళ్ తలైవాస్ ఎట్టకేలకు తిరిగి గెలుపు బాట పట్టింది. వరుసగా నాలుగు పరాజయాలు చవిచూసిన తలైవాస్ శనివారం విజయాన్ని అందుకుంది. నొయిడా వేదికగా బెంగాల్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో 46-31 తేడాతో ఘనంగా నెగ్గింది. మరోవైపు బెంగాల్ హ్యాట్రిక్ పరాజయాల్ని నమోదుచేసింది.
తొలి అర్ధభాగం హోరాహోరీగా సాగింది. ఇరు జట్లు రైడింగ్, ట్యాకిల్లో సమానంగా పాయింట్లు సాధించాయి. అయితే బెంగాల్ వారియర్స్ను తమిళ్ తలైవాస్ ఒక్కసారి ఆలౌట్ చేయడంతో 18-16తో ఫస్ట్ హాఫ్లో స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. అయితే సెకండ్ హాఫ్లో తలైవాస్ ముందు వారియర్స్ జట్టు నిలవలేకపోయింది. ఏకంగా రెండు సార్లు కుప్పకూలింది. తమిళ్ డిఫెండర్ల ముందు బెంగాల్ రైడర్లు నిలవలేకపోయారు.

తమిళ్ తలైవాస్ జట్టులో రైడర్ విశాల్ చాహల్ 12 పాయింట్లు, డిఫెండర్లు అమిర్ హొస్సేన్ 7 పాయింట్లు, నితీశ్ కుమార్ 6 పాయింట్లతో సత్తాచాటారు. బెంగాల్ వారియర్స్లో విశ్వాస్ 9 పాయింట్లు, నితీన్ కుమార్ 8 పాయింట్లు సాధించారు. కాగా, నొయిడా వేదికగా జరిగిన మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్పై దబాంగ్ ఢిల్లీ 35-25తో ఘన విజయం సాధించింది.
బెంగళూరుపై ఢిల్లీ ఆది నుంచే ఆధిపత్యం చెలాయించింది. ఫస్ట్ హాఫ్లో 18-13తో పైచేయి సాధించింది. అదే జోరును రెండో అర్ధభాగంలోనూ ప్రదర్శించి నెగ్గింది. బెంగళూరును దబాంగ్ ఢిల్లీ మొత్తంగా రెండు సార్లు ఆలౌట్ చేసింది. కెప్టెన్ అషు మాలిక్ 14 పాయింట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. బెంగళూరు జట్టులో నితీన్ రావల్ (7 పాయింట్లు) టాప్ స్కోరర్. కాగా, ఇవాళ రాత్రి 8 గంటలకు హర్యానా స్టీలర్స్తో తమిళ్ తలైవాస్, రాత్రి 9 గంటలకు జైపుర్ పింక్ పాంథర్స్తో పుణెరి పల్టాన్ తలపడనున్నాయి.