ప్రోకబడ్డీ లీగ్ సీజన్-11 ఆసక్తికరంగా సాగుతోంది. నొయిడా వేదికగా మంగళవారం జరిగిన పుణెరి పల్టాన్ వర్సెస్ యూపీ యోధాస్ మ్యాచ్ టైగా ముగిసింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన మ్యాచ్లో ఇరు జట్లు 29-29 స్కోరుతో సమంగా నిలిచాయి. అయితే తొలి అర్ధభాగంలో యూపీ జట్టు రెండు పాయింట్ల ఆధిక్యంతో నిలిచింది.
ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి పుణెరి పల్టాన్పై యూపీ యోధాస్ 16-14తో పైచేయి సాధించింది. పుణెరిని ఒక్కసారి ఆలౌట్ చేసింది. అయితే సెకండ్ హాఫ్లో పుణెరి పుంజుకుంది. యూపీని ఆలౌట్ చేసి లెక్క సరిచేసింది. పుణెరి పల్టాన్లో కెప్టెన్ పంకజ్ మోహిత్ 9 పాయింట్లు, రైడర్ అజిత్ 5 పాయింట్లు సాధించాడు. యూపీ యోధాస్లో భవానీ రాజ్పుత్ 10 పాయింట్లు, ఆల్రౌండర్ భరత్ 4 పాయింట్లతో సత్తాచాటారు.

మంగళవారం నొయిడా వేదికగా జరిగిన మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్పై పట్నా పైరేట్స్ 54-31 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆది నుంచే బెంగళూరుపై పట్నా ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థి జట్టును ఒకసారి ఆలౌట్ చేసి తొలి అర్ధభాగాన్ని 20-13తో ముగించింది. సెకండ్ హాఫ్లో మరింత జోరు పెంచింది. బెంగళూరును ఏకంగా రెండు సార్లు ఆలౌట్ చేసింది. రైడింగ్, ట్యాకిల్లో విజృంభించింది.
పట్నా పైరేట్స్లో దేవాంక్ 16 పాయింట్లు, అయాన్ 12 పాయింట్లతో చెలరేగారు. బెంగళూరు బుల్స్లో అక్షిత్ (7 పాయింట్లు) టాప్ స్కోరర్. కాగా, నొయిడా వేదికగా బుధవారం రాత్రి 8 గంటలకు దబాంగ్ ఢిల్లీతో గుజరాత్ జెయింట్స్, రాత్రి 9 గంటలకు యు ముంబాతో తెలుగు టైటాన్స్ తలపడనున్నాయి. ఈ సీజన్లో తెలుగు టైటాన్స్ ఆడిన 10 మ్యాచ్ల్లో ఆరు విజయాలు సాధించి ఏడో స్థానంలో కొనసాగుతోంది.