ప్రోకబడ్డీ లీగ్ సీజన్-11 ఆసక్తికరంగా సాగుతోంది. ఉత్కంఠ పోరులో గుజరాత్ జెయింట్స్పై పుణెరి పల్టాన్ ఆఖరి రైడ్లో పైచేయి సాధించి ఒక్క పాయింట్ తేడాతో నెగ్గింది. శుక్రవారం నొయిడా వేదికగా జరిగిన మ్యాచ్లో గుజరాత్పై 34-33 పాయింట్ల తేడాతో విజయఢంకా మోగించి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఈ సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన పుణెరికి ఇది ఏడో విజయం. మరోవైపు 14 మ్యాచ్ల ఆడిన గుజరాత్ జెయింట్స్కు ఇది తొమ్మిదో ఓటమి. నాలుగు విజయాలతో టేబుల్లో 10వ స్థానంలో నిలిచింది.
మ్యాచ్ ఆరంభం నుంచే గుజరాత్-పుణెరి జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. రైడింగ్, ట్యాకిల్ నువ్వానేనా అన్నట్లుగా పోరాడాయి. తొలి అర్ధభాగాన్ని 16-16తో ముగించాయి. రెండో అర్ధభాగంలోనూ ఇరు జట్లు అదే జోరు ప్రదర్శించాయి. చెరో సారి ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేశాయి. అయితే ఆఖరి రైడ్కు ముందు స్కోరు 33-33తో సమమైంది. కానీ చివరి రైడ్లో గుమన్ను పట్టేసి పుణెరి విజయం సాధించింది. పుణెరి పల్టాన్ జట్టులో కెప్టెన్ ఆకాశ్ షిండే 12 పాయింట్లతో సత్తాచాటాడు. గుజరాత్ జెయింట్స్ సారథి 16 పాయింట్లతో పోరాడాడు.

నొయిడా వేదికగా శుక్రవారం జరిగిన మరో మ్యాచ్లో తమిళ్ తలైవాస్పై హర్యానా స్టీలర్స్ 42-30 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన హర్యానాకు ఇది 12వ విజయం. తన అగ్రస్థానాన్ని హర్యానా మరింత పదిలం చేసుకుంది. మరోవైపు 14 మ్యాచ్లు ఆడిన తలైవాస్కు ఇది ఎనిమిదో ఓటమి. అయిదు విజయాలతో తొమ్మిదో స్థానంలో ఉంది.
తొలి అర్ధభాగం ముగిసేసరికి తమిళ్ తలైవాస్పై హర్యానా స్టీలర్స్ 13-10తో పైచేయి సాధించింది. రెండో అర్ధభాగంగా మరింత దూకుడుగా పాయింట్లు సాధించింది. తలైవాస్ను రెండు సార్లు ఆలౌట్ చేసింది. వినయ్ 9 పాయింట్లు, రాహుల్ 6 పాయింట్లతో విజయంలో కీలక పాత్ర పోషించారు. మొయిన్ 11 పాయింట్లతో పోరాడాడు. కాగా, ఇవాళ నొయిడా వేదికగా రాత్రి 8 గంటలకు పట్నా పైరేట్స్తో బెంగళూరు బుల్స్, రాత్రి 9 గంటలకు జైపుర్ పింక్ పాంథర్స్తో తెలుగు టైటాన్స్ తలపడనున్నాయి.