ప్రోకబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) సీజన్ 11లో తెలుగు టైటాన్స్ హాట్రిక్ పరాజయాన్ని చవిచూసింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో దబాండ్ ఢిల్లీతో శనివారం జరిగిన మ్యాచ్లో 37-41 తేడాతో ఓటమిపాలైంది. మొదటి అర్ధభాగంలో ఢిల్లీపై అయిదు పాయింట్ల ఆధిక్యంతో 20-15తో నిలిచిన తెలుగు టైటాన్స్ సెకండ్ హాఫ్లో తేలిపోయింది. ప్రత్యర్థికి పాయింట్లు సమర్పించుకుని మ్యాచ్ను కోల్పోయింది.
తెలుగు టైటాన్స్లో కెప్టెన్, స్టార్ రైడర్ పవన్ సెహ్రావత్ 18 పాయింట్లతో పోరాడాడు. మరో రైడర్ ఆశిష్ నర్వాల్ 9 పాయింట్లు, ఆల్రౌండర్ విజయ్ మాలిక్ రెండు పాయింట్లు సాధించాడు. దబాంగ్ ఢిల్లీలో కెప్టెన్ నవీన్ కుమార్, రైడర్ అషు మాలిక్ చెరో 15 పాయింట్లతో సత్తాచాటారు. ఇరు జట్లలో డిఫెండర్లు ఆకట్టుకోలేకపోయారు.

పవన్ సెహ్రావత్ దూకుడుతో ఫస్ట్ హాఫ్లో తెలుగు టైటాన్స్దే పైచేయి. ప్రత్యర్థి జట్టును ఒక్కసారి ఆలౌట్ కూడా చేసింది. కానీ రెండో అర్ధభాగంలో దబాంగ్ ఢిల్లీ గొప్పగా పుంజుకుంది. టైటాన్స్ను రెండు సార్లు ఆలౌట్ చేసి మ్యాచ్ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడిన తెలుగు టైటాన్స్ ఒక్క మ్యాచ్లో గెలిచి మూడింట్లో ఓడింది. మరోవైపు మూడు మ్యాచ్లు ఆడిన ఢిల్లీ రెండు విజయాలు సాధించింది.
శనివారం జరిగిన మరో మ్యాచ్ యు ముంబా వర్సెస్ బెంగాల్ వారియర్స్ టైగా ముగిసింది. ఇరు జట్లు హోరాహోరీగా పోరాడంతో 31-31 స్కోరు టై అయ్యింది. యు ముంబా జట్టులో రైడర్ మంజీత్ 7, డిఫెండర్ సోంబిర్ 5 పాయింట్లతో రాణించారు. బెంగాల్ వారియర్స్లో రైడర్ మణీందర్ సింగ్ 8, మయూర్ కడమ్ 6 పాయింట్లతో సత్తాచాటారు. కాగా, ఇవాళ జైపుర్ పింక్ పాంథర్స్తో తమిళ్ తలైవాస్, యూపీ యోథాస్తో గుజరాత్ జెయింట్స్ తలపడనున్నాయి.