ప్రో కబడ్డీ లీగ్ సీజన్-11లో తెలుగు టైటాన్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. రెండు ఓటముల అనంతరం విజయాన్ని అందుకుంది. పుణె వేదికగా శనివారం గుజరాత్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 36-32 పాయింట్ల తేడాతో నెగ్గింది. ఈ గెలుపుతో ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. 20 మ్యాచ్లు ఆడిన తెలుగు టైటాన్స్ 11 విజయాలతో అయిదో స్థానానికి చేరింది. టాప్-6లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తాయి. ఇప్పటికే హర్యానా స్టీలర్స్ ప్లే ఆఫ్స్కు చేరుకుంది.
అయితే తొలి అర్ధభాగంలో తెలుగు టైటాన్స్పై గుజరాత్ జెయింట్స్ పైచేయి సాధించింది. టైటాన్స్ను ఒక్కసారి ఆలౌట్ చేసి 18-11తో ఫస్టాఫ్ను గుజరాత్ ముగించింది. కానీ రెండో అర్ధభాగంలో టైటాన్స్ పంజా విసిరింది. గుజరాత్ను రెండు సార్లు ఆలౌట్ చేసి మ్యాచ్ను సొంతం చేసుకుంది. కెప్టెన్ పవన్ సెహ్రావత్ 12 పాయింట్లతో, విజయ్ మాలిక్ 8 పాయింట్లతో విజయంలో కీలకపాత్ర పోషించాడు.

గుజరాత్ జెయింట్స్ జట్టులో రాకేశ్ 10, కెప్టెన్ గుమాన్ సింగ్ 9 పాయింట్లతో పోరాడాడు. పుణె వేదికగా శనివారం జరిగిన మరో మ్యాచ్లో టేబుల్ టాపర్ హర్యానా స్టీలర్స్పై దబాంగ్ ఢిల్లీ 44-37 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 19 మ్యాచ్ల్లో 10వ గెలుపుతో రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే తొలి అర్ధభాగం హోరాహోరీగా సాగింది. రెండు పాయింట్ల స్వల్ప ఆధిక్యంతో ఢిల్లీ ఫస్టాఫ్ను ముగించింది.
సెకండ్ హాఫ్లో దబాంగ్ ఢిల్లీ దూకుడు పెంచింది. హర్యానా స్టీలర్స్ను రెండు సార్లు ఆలౌట్ చేసింది. మరోవైపు ఢిల్లీని హర్యానా ఒక్కసారి ఆలౌట్ చేసినప్పటికీ.. టేబుల్ టాపర్ పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది. ఢిల్లీలో కెప్టెన్ అషు మాలిక్ (15 పాయింట్లు), హర్యానా టీమ్లో మహ్మద్రీజా (9 పాయింట్లు) టాప్ స్కోరర్. కాగా, ఇవాళ పుణె వేదికగా రాత్రి 8 గంటలకు తమిళ్ తలైవాస్తో జైపుర్ పింక్ పాంథర్స్, రాత్రి 9 గంటలకు యు ముంబాతో యూపీ యోధాస్ తలపడనున్నాయి.